మేమూ ఏదైనా చేయగలమని నిరూపిస్తున్నారీ తరం అమ్మాయిలు. అలాంటివాళ్లే వీళ్లూ. కేరళలో తొలి విమెన్ మెకానిక్ వర్క్షాప్ను ప్రారంభించి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ ‘వనిత’ వర్క్షాప్ని ప్రారంభించింది బిన్సి, మెర్సి, బింటు అనే ముగ్గురు యువతులు. వీరిది కేరళలోని కాసర్గోడ్ జిల్లాలోని వెస్ట్ ఎలేరి అనే చిన్న గ్రామం. పల్లెటూరి అమ్మాయిలం అవకాశాల్లేవంటూ కూర్చోలేదు వీళ్లు. తమ కాళ్లపై తాము నిలబడేలా ఏం చేయగలమా అని ఆలోచించారు.
‘రీబిల్డ్ కేరళ’ పేరుతో ఆ రాష్ట్రం మహిళలకు ఉపాధి మార్గాలు చూపిస్తోంది. వాళ్లు ప్రవేశపెట్టిన ‘కుడుంబశ్రీ’ ఇప్పటికే విజయం సాధించింది. ఆ ఉత్సాహంతోనే ప్రభుత్వం మరిన్ని రంగాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలనుకుంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొన్న ఈ ముగ్గురూ వాహనాల రిపేరింగ్లో ఆసక్తి చూపారు.
శిక్షణ తీసుకొని సొంతంగా టూవీలర్ వర్క్షాప్ ప్రారంభించారు. కొద్దిరోజుల్లోనే తమ పనితనంతో అందరినీ ఆకట్టుకున్నారు. దీంతో తమ బైక్స్ను రిపేరు చేయించుకునేందుకు చాలామంది వాహనదారులు వీరి దగ్గరకు వస్తున్నారు. అలా వీరు తమతో పాటు మరో ముగ్గురు మహిళలకూ ఉపాధి కల్పిస్తున్నారు.
‘ప్రస్తుతానికి టూవీలర్లపైనే దృష్టిపెట్టాం. భవిష్యత్తులో ఆటోలు, కార్లనూ రిపేరు చేస్తాం. అమ్మాయిలు అన్ని పనులూ చేయగలరు. శిక్షణిచ్చేవారే అరుదు. అందుకే ఆసక్తి ఉన్న మహిళలకు శిక్షణ కూడా ఇవ్వాలనుకుంటున్నాం’ అంటున్నారీ నారీమణులు.
More Stories
సప్తపదితో ముడిపడినదే హిందూ వివాహం
మే 4 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
కొవిషీల్డ్ పై దర్యాప్తు కోరుతూ సుప్రీంలో పిటిషన్