తెలంగాణలో ముగిసిన ప్రచార పర్వం, అమలులో ఆంక్షలు

తెలంగాణలో సుమారు రెండు నెలలుగా హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ప్రచారానికి తెర పడింది. మంగళవారం సాయంత్రం 5 గంటలతో ప్రచారపర్వానికి తెరపడింది. నేతలందరూ చివరి నిమిషం వరకూ సర్వశక్తులను ఒడ్డి ప్రచారం చేశారు. గల్లీలన్నీ ప్రచార రథాలతో, పార్టీల పాటలతో, నేతల ప్రసంగాలతో మారుమోగిపోగా.. ప్రచారం సమయం ఈరోజు ఐదు గంటలతో ముగిసిపోవటంతో.. ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయాయి. 
 
పల్లెలు, పట్టణాల్లోని వాతావరణమంతా.. ఎడతెరపిలేకుండా కురిసిన జోరు వాన వెలిస్తే ఎలా ఉంటుందో అలా మారిపోయింది. ఇక ప్రచారానికి తెరపడటంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం కీలక ఘట్టానికి చేరుకుంది. నవంబర్ 30న జరుగనున్న పోలింగ్ కోసం ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పోలింగ్ నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. మరిన్ని ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
 
సినిమా హాల్, సోషల్ మీడియాలో ప్రచారాలు బంద్ చేయాలని సిఇఒ వికాస్ రాజ్ తెలిపారు. అభ్యర్థితో పాటు ఒకే వాహనానికి అనుమతి ఉంటుందన్నారు. పార్టీ, అభ్యర్థి పేరు లేకుండా ఓటర్ స్లిప్పులు పంచాలని చెప్పారు. పోలింగ్ వాహనాలను కూడా ఏజెంట్లు పాలో కావొచ్చన్నారు. ఇవిఎంలను పోలింగ్ ఏజెంట్లు ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదని హెచ్చరించారు. స్థానికేతరులు నియోజకవర్గాల నుంచి వెళ్లాలని ఇసి ఆదేశాలు జారీ చేసింది. సైలెన్స్ పిరియడ్ మొదలైందని వికాస్ రాజ్ పేర్కొన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి ఎన్నికల బరిలో 2,290 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారిలో 221 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేయగా, 45 వేల మంది పోలీసులు భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి సోషల్‌ మీడియాలోనూ రాజకీయ ప్రకటనలకు అనుమతి లేదని ఈసీ తెలిపింది. 

ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాను రంగంలోకి దింపారు. తెలంగాణలో జరగనున్న ఎన్నికలకు లక్ష మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారని అధికారులు తెలిపారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలు ఎన్నికల నిర్వహణకు విధులను నిర్వర్తిస్తున్నాయి. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో అదనపు బలగాలను మోహరించారు. 

రాష్ట్ర ఎన్నికల విధుల్లో 375 కంపెనీల కేంద్ర బలగాలు ఉన్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలోని 4400 సమస్యాత్మక ప్రాంతాలలో అదనపు భద్రతా బలగాలను మోహరించినట్లు తెలిపారు. ఎన్నికలకు అస్సాం రైఫిల్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, తెలంగాణ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల విధులలో 45 వేలమంది తెలంగాణ పోలీసులు ఉండగా, 18 వేల మంది హోంగార్డులు ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. ములుగు జిల్లాలో మావోయిస్టు యాక్షన్ టీం చొరబడిందన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. 
 
మావోయిస్టులు రాజకీయ నేతలు, పోలీసుల లక్ష్యంగా భారీ స్కెచ్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పోలీసులు మావోల ప్రభావిత అటవీ ప్రాంతాలలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం సాయంత్రం నుంచి పోలింగ్ ముగిసే వరకు 144 సెక్షన్ అమలులో ఉండనుంది.