కార్తీక పౌర్ణమి రోజు ప్రధాని మోదీ వెంకన్న దర్శనం

తిరుమల శ్రీవారిని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కార్తీక పౌర్ణమి నాడు దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం దగ్గర ప్రధానికి టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు.  మోదీ వెంట గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉన్నారు.
 
ప్రధానికి టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వామి వారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు. ప్రధాని సుమారు 50 నిమిషాల పాటు ఆలయంలో గడిపారు. ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ తిరుమలకు రావడం ఇది నాలుగోసారి. ప్రధాని తిరుమల నుంచి  ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తెలంగాణకు బయలుదేరారు.
 
అంతకుముందు ప్రధాని మోదీ ఆదివారం రాత్రి తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధానికి రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో ఘనంగా సత్కరించి సాదర స్వాగతం పలికారు. ఆదివారం రాత్రి ప్రధాని తిరుమలలోని రచనా గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. దర్శనం అనంతరం రచనా గెస్ట్‌‌హౌస్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని రేణిగుంట నుంచి తెలంగాణకు బయల్దేరారు.