కాంగ్రెస్ అభ్య‌ర్ధులు గెలిచినా బిఆర్ఎస్ లోకే దూకేస్తారు

కాంగ్రెస్ అభ్య‌ర్ధులు గెలిచిన ఆ త‌ర్వాత వారంతా బిఆర్ఎస్ పార్టీలోకి చేరిపోతార‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. అందుకనే నిబద్దత క‌లిగిన బిజెపి అభ్య‌ర్దులను గెలిపించాల‌ని తెలంతాణ ఓట‌ర్ల‌కు పిలుపు ఇచ్చారు.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మక్తల్‌లో బీజేపీ నిర్వహించిన సంకల్ప సభలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను ఇంటికి పంపే సమయం వచ్చిందని స్పష్టం చేశారు. 
 
బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శలు గుప్పించారు. ద‌ళిత బంధు నిధులు బిఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల జేబుల‌లోకి వెళితే, ప్రాజెక్ట్ ల సొమ్ము కెసిఆర్ ఖ‌జ‌నాల‌కు చేరిందంటూ విమ‌ర్శించారు. లిక్కర్, గ్రానైట్, మియాపూర్ భూములు, ఓఆర్ఆర్ ఇలా ఈ ప్రభుత్వంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని ధ్వజమెత్తారు. 
 
పదేళ్ల పాలనలో అవినీతి తప్ప కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదని అమిత్ షా విమర్శించారు. 1,200 మంది బలిదానాలతో తెలంగాణ ఏర్పడితే రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. మిగులు ఆదాయం ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారని చెబుతూ కానీ లక్ష రుణ మాఫీ చేయలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఉద్యోగాలను భర్తీ చేయలేదని విమర్శించారు.

ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్ ఆ హామీని నిలుపుకోలేదని అమిత్ షా విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఎన్నికల ముందు వేర్వేరు కండువాలతో వస్తారని ఎన్నికలయ్యాక కలిసిపోతారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా బీఆర్ఎస్, ఎంఐఎంలకు ఓటు వేసినట్టేనని చెప్పారు. 

కేసీఆర్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. దీంతో కేసీఆర్ విశ్వసనీయత కోల్పోయారని చెబుతూ  సినిమా, ఫార్మా, ఎడ్యుకేషన్ సిటీలని ఏర్పాటు చేస్తానని చేయలేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడూ వారసుల గురించే ఆలోచిస్తాయని ధ్వజమెత్తారు.  బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన వారందరిని  జైలుకు పంపిస్తామని అమిత్ షా తేల్చి చెప్పారు. తెలంగాణలో బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటించిన ఏకైక పార్టీ బీజేపీ అని గుర్తు చేస్తూ బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి అధికారం ఇవ్వాలని ప్రజలను కోరారు