కబ్జా స్థలాలపై బుల్ డోజర్లు దించుతా

బిఆర్ఎస్ నాయకులు కబ్జాలకు పాల్పడ్డ భూముల్లో బుల్డోజర్ లు దించుతానని కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలేమైనా మీ అయ్య జాగీరనుకున్నారా కమలాకర్ అంటు తన ప్రత్యర్థి, రాష్త్ర మంత్రి గంగుల కమలాకర్ పై మండిపడ్డారు.
 
తానెవ్వరికి భయపడనని చెబుతూ బీఆర్ఎస్ నేతలు కబ్జా చేసిన స్థలాల్లో బుల్ డోజర్లు దించుతానని, వాటిని స్వాధీన పర్చుకుని ఆ స్థలాల్లో పేదలకు ఇండ్లు కట్టించి పంచుతానని తేల్చి చెప్పారు.  కరీంనగర్ లో బిఆర్ఎస్ నేతల భూకబ్జాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని పేర్కొంటూ తనను గెలిపిస్తే వాళ్ల సంగతి తేలుస్తానని హెచ్చరించారు. 

ఓటు వేసే ముందు ఒకటికి రెండు సార్లు పనిచేసే నాయకులను ఎన్నుకోవాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేసారు.  బియ్యం టెండర్లలో గోల్ మాల్ కాలేదని, గంగుల కమలాకర్ నిజంగా తప్పు చేయలేదని భావిస్తే దేవుడి గుడి వద్దకొచ్చి ప్రమాణం చేయాలని సంజయ్ సవాల్ విసిరారు.

రేషన్ షాపుల్లో పేదలకు ఇచ్చే ఉచిత బియ్యం పైసలన్నీ కేంద్రమే భరిస్తోందని  ఆయన చెప్పారు. ఐకేపీ కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల నుండి కొనే వడ్ల పైసలన్నీ కేంద్రమే చెల్లిస్తోందని పేర్కొన్నారు. వడ్లను సేకరించినందుకుగాను కేసీఆర్ ప్రభుత్వానికి బ్రోకరేజీ రూపంలో కమీషన్ కూడా కేంద్రమే ఇస్తోందని తెలిపారు. 

వీటికి సంబంధించి లెక్కాపత్రంతో వివరాలు తనవద్ద ఉన్నాయని చెబుతూ బహిరంగ చర్చకు సిద్ధమని సంజయ్ స్పష్టం చేశారు.  పౌరసరఫరాల మంత్రిగా ఉంటూ కరీంనగర్ ప్రజలకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, బీసీ మంత్రిగా ఉంటూ బీసీలకు బీసీ బంధు పైసలియ్యలేదని విమర్శించారు. 

వీటిపై తాను ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలబడితే గంగుల తనను అవినీతిపరుడిగా చిత్రీకరిస్తూ ప్రజలను దారి మళ్లించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తాను నిజంగా అవినీతికి పాల్పడితే ఆ ఆస్తిపాస్తులకు సంబందించిన డాక్యుమెంట్లన్నీ తీసుకురా… అవన్నీ ప్రజలకు రాసిచ్చేస్తానని సంజయ్ సవాలు చేశారు. గంగుల ఆస్తిపాస్తుల డాక్యుమెంట్లన్నీ తీసుకొస్తే, తాను తీసుకొస్తానని చెప్పారు. గంగుల ఆస్తుల్ని ప్రజలకు రాసిచ్చేందుకు సిద్ధమా? అంటూ ప్రశ్నించారు.