ఉత్తరకాశీ టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికుల ఫోటోలు

ఉత్తరకాశీలోని కుంగిపోయిన సిల్క్‌యారా టన్నెల్‌లో  చిక్కుకుపోయిన కార్మికుల ఫొటోలు తొలిసారి బయటకు వచ్చాయి. మంగళవారం  ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎనిమిది రోజుల క్రితం 41 మంది కార్మికులు టన్నెల్‌లో చిక్కుకుపోయారు. గత 10 రోజులుగా లేదా 240 గంటలకు పైగా ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను చేరుకోవడానికి రెస్క్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

 సోమవారం ఆరు అడుగుల వెడల్పాటి పైపు‌లైన్ ద్వారా వారికి ఆహారం అందించారు. చిక్కుకుపోయిన కార్మికులు ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు టన్నెల్‌లోకి ఓ కెమెరాను పంపిన అధికారులు దాని ద్వారా వీడియో తీశారు. కార్మికులందరూ క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

తాము బాగానే ఉన్నామని, పరిస్థితులను తట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వారు చెప్పారు. అధికారులు.. వాకీ టాకీలతో కార్మికులతో మాట్లాడారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా ఉత్తరకాశీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్‌ గురించి ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆయన సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.

 “మొదటి సారిగా ఉత్తరకాశీలోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో శిథిలాల్లో చిక్కుకున్న కార్మికుల విజువల్స్ బయటకొచ్చాయి. కార్మికులందరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారు, త్వరలో వారిని క్షేమంగా బయటకు తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాము,” అని ఆయన తెలిపారు.

కాగా, సోమవారం రాత్రి కార్మికులకు పైపు ద్వారా గ్లాస్‌ సీసాల్లో కిచిడీ పంపించారు. అంతకుముందు డ్రైఫ్రూట్స్‌ మాత్రమే అందించారు. ఈ ఉదయం వారికోసం వేడివేడి అల్పాహారం కూడా సిద్ధం చేశారు. త్వరలో వారికి మొబైల్‌ ఫోన్లు, చార్జర్లను కూడా పంపిస్తామని రెస్క్యూ ఆపరేషన్‌ ఇన్‌చార్జి కల్నర్‌ దీపక్‌ పాటిల్‌ చెప్పారు.

నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఐడీసీఎల్) డైరెక్టర్ అన్షు మనీష్ ఖల్ఖో మాట్లాడుతూ కార్మికులు ఎలా ఉన్నారో చూడడానికి పైప్‌లైన్ ద్వారా కెమెరాలను పంపిచినట్లు చెప్పారు. బయటికొచ్చిన విజువల్స్‌లో సొరంగంలో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా ఉండడంతో వారి కుటుంబసభ్యులకు పెద్ద ఊరట లభించింది.

మరోవైపు టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పెద్ద డ్రిల్లింగ్‌ యంత్రాలు సొరంగం వద్దకు చేరకున్నాయి. అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుల బృందం కూడా ఘటనా స్థలంలో ఉన్నది. ఇంటర్నేషనల్ టన్నెలింగ్, అండర్‌గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్నాల్డ్ డిక్స్ ఆధ్వర్యంలో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్నది.