* రంగంలోకి దిగిన రెండు రఫెల్ యుద్ధ విమానాలు
గత ఆరు నెలలకు పైగా జాతుల మధ్య ఘర్షణతో తీవ్ర రణరంగంగా మారిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రాజధాని ఇంఫాల్ ఎయిర్పోర్ట్ వద్ద ఆదివారం గుర్తు తెలియని వస్తువు కనిపించడం కలకలం రేపుతోంది. దీంతో భారత వాయు సేన అప్రమత్తమై గుర్తు తెలియని వస్తువు (యుఎఫ్ఓ)ను కనిపెట్టేందుకు ఏకంగా 2 రఫేల్ యుద్ధ విమానాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టిన్నట్లు రక్షణ శాఖ వర్గాలు వివరాలు తెలిపాయి.
ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మణిపూర్ ఎయిర్పోర్టు వద్ద ఓ గుర్తు తెలియని ఎగిరే వస్తువు గాల్లో ఎగరడం కనిపించడాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్-ఏటీసీకి సమాచారం ఇచ్చారు. ఈ ఘటనతో అలర్ట్ అయిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది వెంటనే విమానాల రాకపోకలను నిలిపివేసింది.
ఆ గుర్తు తెలియని వస్తువును గుర్తించేందుకు రెండు రఫేల్ ఫైటర్ జెట్లను రంగంలోకి దించిన ఐఏఎఫ్ గాలింపు చేపట్టింది. ఇంఫాల్ ఎయిర్పోర్టు వద్ద ఏదో తెలియని వస్తువు చక్కర్లు కొడుతోందని సమాచారం అందగానే దానికి దగ్గర్లో ఉన్న పశ్చిమ బెంగాల్లోని హషిమార్ ఎయిర్బేస్ నుంచి ఐఏఎఫ్ వెంటనే ఒక రఫేల్ యుద్ధ విమానాన్ని పంపించింది.
అడ్వాన్స్డ్ సెన్సర్లు కలిగిన ఆ లేటెస్ట్ ఫైటర్ జెట్ ఘటనా స్థలంలో చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ ఆ వస్తువు కోసం తీవ్ర గాలింపు చేపట్టింది. అయితే అక్కడ అలాంటి వస్తువు ఏదీ కనిపించకపోవడంతో ఆ రఫేల్ ఫైటర్ జెట్ ఎయిర్ బేస్కు వెనక్కి తిరిగొచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికి మరో రఫేల్ ఫైటర్ జెట్ గాలించినా ఎలాంటి వస్తువు కనిపించలేదని రక్షణశాఖ వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. మరోవైపు ఇంఫాల్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ మెకానిజమ్ను యాక్టివేట్ చేసినట్లు ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఈస్ట్రన్ కమాండ్ తెలిపింది. ఆ తర్వాత నుంచి ఆ వస్తువు గాల్లో కనిపించకుండా పోయిందని వెల్లడించింది.
ఇలా గగనతలంలో ఏర్పడిన అంతరాయం కారణంగా దాదాపు 3 గంటల పాటు ఇంఫాల్ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఇందులో కొన్ని విమానాలను దారిమళ్లించగా, మరికొన్నింటి విమాన ప్రయాణాలను రీ షెడ్యూల్ చేసినట్లు వెల్లడించారు.
More Stories
బయటపడిన మావోయిస్టుల భారీ ఆయుధాల డంప్
99.1 కోట్లకు చేరిన భారత ఓటర్ల సంఖ్య
మహారాష్ట్రలో పుష్పక్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో 12 మంది మృతి