చంద్రబాబుకు హైకోర్టులో రెగ్యులర్ బెయిల్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. స్కిల్ కేసులో ఇప్పటికే చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఈ నెల 28న చంద్రబాబు రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని హైకోర్టు తెలిపింది. 

అయితే ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.  ఈనెల 29 నుంచి బెయిల్‌కు అంతకుముందు ఉన్న షరతులన్నింటినీ తొలగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈనెల 28లోపు చంద్రబాబు హెల్త్ రిపోర్టును విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జికి సమర్పించాలని ఆదేశించింది. 

ఈనెల 29 నుంచి చంద్రబాబు రాజకీయ ర్యాలీల్లో నేరుగా పాల్గొనవచ్చని వెల్లడించింది. ఇక, ఇప్పుడు సుప్రీం కోర్టులో వాదనలు పూర్తయిన క్వాష్ పిటీషన్ పైన తీర్పు వెల్లడి కావాల్సి ఉంది. 53 రోజులు జైలులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు కు ఈ తీర్పు భారీ ఉపశమనంగా మారనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ సెప్టెంబర్ 9న నంద్యాలలో అరెస్టు చేసింది. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు ప్రవేశపెట్టగా కోర్టు రిమాండ్ విధించింది. 

దీంతో చంద్రబాబు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆరోగ్య కారణాలతో ఇటీవల హైకోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ఈ నెల 17న ముగిశాయి. దీంతో తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. 

చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌, ఏపీ సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో హైకోర్టు సోమవారం బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపిస్తూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కావాలనే చంద్రబాబును అరెస్టు చేశారని తెలిపారు. ఈ కేసులో 2018 నుంచి విచారణ జరుగుతుంటే ఇప్పుడు ఇంత హడావుడిగా విచారణ చేయాల్సిన అవసరం ఏముందని ప్రస్తావించారు. చంద్రబాబును ఇరికించడం కోసమే ఇదంతా చేశారని పేర్కొంటూ చంద్రబాబుకు వెంటనే బెయిల్ ఇవ్వాలని కోరారు.

సీఐడీ తరపున హైకోర్టులో ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపిస్తూ చంద్రబాబు పలు అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని, చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అన్న పొన్నవోలు ఈ కేసు తీర్పు ద్వారా సమాజానికి ఒక మెసేజ్ వెళ్లాలని వాదించారు. 

కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తారని తెలిపారు. చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా మూడు రూ. 10 నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్ల రూపాయలు హైదరాబాద్‌కు తరలించారని,  బోస్‌ అనే వ్యక్తి ఫోన్‌ మెస్సేజ్‌ల ద్వారా ఈ విషయం బయటపడిందని వివరించారు. 

సీమెన్స్‌ వారే నిధులు మళ్లింపు జరిగిందని నిర్థారించారని, చంద్రబాబు ఆదేశాల మేరకే ఆ విధంగా వ్యవహరించారని చెప్పారు. చీఫ్‌ సెక్రటరీ తన లేఖలో అప్పటి సీఎం రూ.270 కోట్లు విడుదల చేయమని చెప్పారని ఫైనాన్స్‌ సెక్రటరీకి లేఖ రాశారని వాదించారు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. అయితే ఈ కేసులో హైకోర్టు చంద్రబాబు బెయిల్ మంజూరు చేసింది.