నవంబర్ 3వ తేదీ నుంచి ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నా వివిధ పార్టీల నాయకులు పెద్దగా లెక్క చేయడం లేదు. ఓటర్లకు దగ్గరయ్యేందుకు అభ్యర్థులు ఏదో రకంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొద్దిరోజుల కిందటి వరకు వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఫొటోలతో ఉన్న టిఫిన్ బాక్స్ బ్యాగులు, చీరలు, ఇతర వస్తువులు ఎన్నికల అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే.
తాజాగా గురువారం పరకాల నియోజకవర్గంలో ఓ ఎమ్మెల్సీకి సంబంధించిన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కుట్టుమిషన్లు తీసుకెళ్తుండగా.. దానిపైనా కేసు నమోదైంది. ఇదిలాఉంటే ఎన్నికల పోటీ చేసే వివిధ పార్టీల అభ్యర్థులు, నాయకుల అక్రమాలు, కోడ్ ఉల్లంఘనలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సీ-విజిల్ యాప్ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
ఈ యాప్ తో పాటు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేసింది. కాగా ఎక్కడికక్కడ ఉల్లంఘనలు పెరిగిపోతుండగా.. జిల్లాలో ఇప్పటివరకు వివిధ రూపాల్లో అధికారులకు 1,393 ఫిర్యాదులు అందాయి. అందులో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి1950 నెంబర్కు అత్యధికంగా 1,181 ఫిర్యాదులు వచ్చాయి. 1800 425 1816 టోల్ ఫ్రీ నెంబర్కు 69, సీ విజిల్ యాప్ లో 76, ఇతరత్రా ఇంకో 67 కంప్లైంట్స్ ఆఫీసర్లకు అందాయి.
కాగా మొత్తం 1,393 ఫిర్యాదుల్లో దాదాపుగా అన్ని క్లియర్ చేశామని, కేవలం ఒకే ఒక ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎక్కడ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా స్వేచ్ఛగా ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
More Stories
వడ్డీ రేట్లను భారీగా పెంచిన స్టేట్ బ్యాంకు
హైదరాబాద్ జూలో మగ తెల్లపులి మృత్యువాత
చాబహార్ పోర్టుపై చిన్న చూపు తగదు .. అమెరికాకు హితవు