మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ లలో రేపే పోలింగ్

* ముగిసిన ప్రచార పర్వం

బుధవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం గడువు పూర్తయిన మధ్య ప్రదేశ్ చత్తీస్‌గఢ్‌లలో శుక్రవారం పోలింగ్ జరిపేందుకు రంగం సిద్ధమైంది.  మధ్యప్రదేశ్ లోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు, ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడతలోని 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. 
 
ఛత్తీస్‌గఢ్‌లో తొలిదశలో 20 స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ పూర్తయింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బీఎస్పీతోపాటు కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నాయి. అయితే బీజేపీ , కాంగ్రెస్ మధ్యే కీలక పోరు కొనసాగనుంది. ఛత్తీస్‌గఢ్ లోనూ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17 ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది.
 
మధ్య ప్రదేశ్ లో మొత్తం 230 స్థానాలకు 5.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొననున్నారు. ఇందులో 2.88 కోట్ల మంది పురుషులు కాగా, 2.72 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో 22.36 లక్షల మంది యువతీ యువకులు తొలిసారిగా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నిక ల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచి అధికారంలోకి వచ్చింది.
 
కాని, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలి బిజెపి అధికారంలోకి వచ్చింది.  మరి కొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్లో మొత్తం 29 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఆ పార్టీ మధ్యప్రదేశ్ లో అత్యధిక లోక్ సభ స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుంది. 
 
ఈ నేపథ్యంలో, ప్రస్తుత ఎన్నికల ఫలితాలు ఓటర్ల మూడ్ ను తెలియజేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల బరిలో ప్రధాన రాజకీయ పార్టీలైన బిజెపి కాంగ్రెస్ ల నుంచి కీలక నేతలు బరిలో ఉన్నారు.
 
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి రెండో దశలో మొత్తం 958 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 827 మంది పురుషులు, 130 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. రెండో దశలో మొత్తం 1.63 కోట్ల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొననున్నారు. దీనికోసం 18,883 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ , ప్రియాంక గాంధీ వాద్రాలు ముమ్మరంగా ప్రచారం చేశారు. 
 
బీజేపీ తరఫున అమిత్ షా, జేపీ నడ్డా, హిమంత బిశ్వశర్మ, అనురాగ్ ఠాకూర్ తదితర నేతలు చివరిరోజు ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ బెమెతరా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో కులగణనను మరోసారి డిమాండ్ చేశారు.