జైషే చీఫ్ అత్యంత సన్నిహితుడు కరాచీలో హత్య

 
పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా, జైషే ముహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజార్‌కు అత్యంత సన్నిహితుడైన ఉగ్రవాది మౌలానా రహీమ్ ఉల్లాహ్ తారిఖ్‌ను కరాచీలో గుర్తుతెలియని వ్యక్తి కాల్చి చంపాడు.  మతపరమైన కార్యక్రమానికి వెళ్తోన్న ఉల్లాహ్‌పై దుండగుడు కాల్పులు జరపడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. 
 
నెల రోజుల వ్యవధిలో ముగ్గురు అత్యంత కీలక నేతలు హత్యకు గురికావడం గమనార్హం.  టార్గెట్ హత్యలను ఉగ్రవాద చర్యలుగా పేర్కొన్న కరాచీ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. గతవారం సుంజ్వాన్ దాడి సూత్రధారి, లష్కరే తొయిబా ఉగ్రవాది అక్రమ్ ఘాజీని గుర్తుతెలియని వ్యక్తులు ఖైబర్ పఖ్త్వుంఖా ప్రావిన్సుల్లో కాల్చి చంపిన విషయం తెలిసిందే. 
 
అతడ్ని అపహరించి, నియంత్రణ రేఖ సమీపంలోని పాక్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దుల్లో శిరచ్ఛేదం చేశారు. తలలేని మొండెం పోలీసులకు లభ్యమైంది.  తాజాగా, తారీఖ్ హత్య వెనుక స్థానిక ఉగ్రవాదులు, జైషే ముహ్మద్ సంస్థ ఆధిపత్య పోరే కారణమని పోలీసులు భావిస్తున్నారు.  భారత్, కశ్మీర్‌కు వ్యతిరేకంగా నిర్వహిస్తోన్న సభలో ప్రసంగించేందుకు తారిఖ్ వెళుతున్నట్లు విశ్వసనీ వర్గాలు తెలిపాయి.
ఈ నెలలో జరిగిన చివరి రెండు హత్యలు చాలా ప్రాధాన్యం ఉన్నవే. అక్రమ్ ఖాన్ అలియాస్ ఘాజీ 2018-2020 మధ్యకాలంలో లష్కర్‌ ఉగ్రవాద సంస్థ రిక్రూటర్లలో అగ్రగామిగా ఉన్నాడు.  కాగా, సెప్టెంబరులో పీఓకేలోని రావలకోట్‌లోని అల్ ఖుద్దూస్ మసీదు వెలుపల లష్కరే అగ్ర కమాండర్ రియాజ్ అహ్మద్ హత్యకు గురయ్యాడు. పీఓకేలో లష్కర్ కార్యకలాపాలు, రిక్రూట్‌మెంట్‌లను ఆయనే నిర్వహిస్తున్నాడు. 
 
గత మేలో వాంటెడ్ టెర్రరిస్ట్, ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరమ్‌జిత్ సింగ్ పంజ్వార్‌ను లాహోర్‌లోని తన నివాసానికి సమీపంలో మార్నింగ్ వాక్ చేస్తుండగా గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు. కరాచీలోని గులిస్థాన్-ఎ-జౌహర్‌లో లష్కరేకు చెందిన మౌలానా జియావుర్ రెహ్మాన్, ముఫ్తీ ఖైజర్ ఫరూక్‌లు కుడా హత్యకు గురయ్యారు. 
 
2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఒకరైన జైషే ఉగ్రవాది షాహిద్ లతీఫ్‌ను అక్టోబర్ 10న పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లోని మసీదులో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.