మోదీ డిగ్రీ వివరాలు కోరిన పిటిషన్‌ కొట్టివేత

ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ వివరాలు అందించాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ని గుజరాత్ హైకోర్టు గురువారం కొట్టేసింది. దీంతో కేజ్రీవాల్ కి మరో దెబ్బ తగిలినట్టైంది. ప్రధాని నరేంద్ర మోదీ అకాడమిక్ డిగ్రీ వివరాలు ఇవ్వాల్సిన బాధ్యత గుజరాత్ యూనివర్సిటీకి లేదంటూ ఈ ఏడాది మార్చి 31న హైకోర్టు తీర్పునిచ్చింది. 
 
ఈ తీర్పును సవాలు చేస్తూ కేజ్రీవాల్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు ఆయన పిటిషన్ ని కొట్టేసింది. మోదీ విద్యార్హతను తెలిపే ధ్రువపత్రాలు చూపించే అవసరం లేదని తేల్చి చెప్పింది. మార్చిలో ఏడేళ్ల క్రితం సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కొట్టేసిన న్యాయస్థానం కేజ్రీవాల్ కు రూ.25 వేల జరిమానా కూడా విధించింది.

ప్రధాని విద్యార్హతలపై ఆరోపణలు చేస్తున్న కేజ్రీ ఆయన ఉన్నత విద్య సర్టిఫికేట్ల కోసం 2016లో సమాచార హక్కు చట్టం కింద కేంద్ర సమాచార కమిషన్ కి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు పరిశీలించిన సీఐసీ మోదీ ధ్రువపత్రాలు చూపించాలని పీఎంవో కార్యాలయ పీఐవో, గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీల పీఐవోలను 2016లో ఆదేశించింది. 

కొన్నాళ్లకు సీఐసీ ఆదేశాలను సవాలు చేస్తూ గుజరాత్ వర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో సీఐసీ ఆదేశాలపై అప్పుడు హైకోర్టు స్టే విధించింది. అనంతరం విచారించిన కోర్టు ఆ వివరాలు బయటపెట్టే అవసరం లేదని తీర్పునిచ్చింది. తాజాగా కోర్టు తీర్పు సవాలు చేస్తూ కేజ్రీవాల్ మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారించిన కోర్టు ఆయన పిటిషన్‌ని కొట్టేసింది. ప్రధాని మోదీ 1978లో గుజరాత్ వర్సిటీ నుంచి గ్రాడ్యూయేషన్, 1983లో దిల్లీ వర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు.