అమిత్ షాకు త్రుటిలో తప్పిన ప్రమాదం

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి పెనుప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌లోని నాగౌర్‌‌లో రోడ్ షో నిర్వహిస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న ప్రచార రథం పై భాగం ఓ విద్యుత్తు వైరుకు తగిలింది. వెంటనే నిప్పు రవ్వలు ఎగసిపడి, ఆ వైరు తెగిపోయింది.  దీనిని  గమనించిన బిజెపి నేతలు వెంటనే అప్రమత్తమయ్యారు. 
అమిత్‌ షా వాహనం వెనుక ఉన్న అన్ని వాహనాలను అప్రమత్తం చేశారు. వాహనాలను నిలిపివేసి కరెంటు సరఫరాను నిలిపేశారు.  దీంతో ప్రమాదం తప్పింది. హోమంత్రి అమిత్ షా సహా ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.  ఎన్నికల సభలో పాల్గొనేందుకు బిడియాద్ గ్రామం నుంచి పర్బత్‌సర్ దిశగా వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

మంగళవారం దివానా కుచమన్ జిల్లాలోని నవాన్, మక్రానా, పర్బత్‌సర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల సభలో ప్రసంగించేందుకు హోంమంత్రి వెళ్లారు. మధ్యాహ్నం కూచమన్‌లో జరిగిన సభలో ప్రసంగించిన అనంతరం మక్రానాకు వెళ్లి మక్రానాలో ప్రసంగించిన అనంతరం రథం ఎక్కి పర్బత్‌సర్‌కు చేరుకున్నారు. 

పర్బత్‌సర్ నగరంలోని సాంద్ చౌక్ సమీపంలో రథం వెళుతుండగా, ఎల్‌టి విద్యుత్ లైన్ వైర్ రథాన్ని తాకడంతో నిప్పురవ్వలు ఎగిరి తీగ తెగి కిందపడింది. రథం ముందుకెళ్లినా వెనకాలే సెక్యూరిటీ సిబ్బంది జీపు ఆగింది. ఆ తర్వాత రథాన్ని కూడా నిలిపివేశారని అధికారులు తెలిపారు. మంగళవారం రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించిన అమిత్‌ ష బిజెపి అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 

ఈ ఘటనపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లాట్ స్పందించారు. ప్రమాదం తప్పడంపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. కాగా రోడ్డుకు ఇరువైపులా ఇళ్లు, దుకాణాలు ఉన్న వీధిలో ర్యాలీ నిర్వహించారు. దీంతో కరెంటు వైర్లు వాహనానికి దగ్గరగా ఉన్నాయని తెలుస్తోంది.