అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో బిజెపి మరింత దూకుడు పెంచుతుంది. ముఖ్యంగా అధికార పార్టీ బిఆర్ఎస్ ఫై విమర్శలు కురిపిస్తూ వస్తుంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ పాలనపై 154 అంశాలతో కూడిన ఛార్జ్షీట్ ను విడుదల చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పులు అంటూ బీజేపీ చార్జ్షీట్ కమిటీ చైర్మన్ మురళీధరరావు విడుదల చేసారు.
2014, 18 మేనిఫెస్టో లతో పాటు అసెంబ్లీ, సభల్లో కేసీఅర్ ఇచ్చిన హామీలు, అవినీతిని ఈ ఛార్జ్షీట్లో ఎండగట్టింది బీజేపీ. ఇసుక, గ్రానైట్, ల్యాండ్, డ్రగ్, లిక్కర్, కాంట్రాక్ట్ మాఫియా అన్నింట్లో బీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని బీజేపీ ఛార్జ్షీట్లో ఆరోపించింది. సంక్షేమం పేరుతో ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో గులాబీ నేతలకు వాటా ఉందని, వారంతా కమీషన్లు వసూల్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది.
అమరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రం నేడు కల్వకుంట్ల కుటుంబ పరమైందని మండిపడింది. రైతును రాజునుచేస్తానని చెప్పిన కేసీఆర్ పాలనలో తొమ్మిదిన్నరేళ్లలో 7,800 మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారని ఛార్జ్షీట్లో బీజేపీ ప్రస్తావించింది. సాగుకి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామనేది వాస్తవం కాదని తెలిపింది. ఏకకాలంలో రుణమాఫీ జరగలేదని చెప్పింది.
దళిత ముఖ్యమంత్రి హామీ నుంచి మొదలు దళితులకు 3 ఎకరాల భూమి, దళిత బంధు వరకు దగా చేసిందని.. ఇలా 154 అంశాలపై బీజేపీ తన ఛార్జ్షీట్లో ప్రస్తావించింది. ఈ సందర్భంగా మురళీధరరావు మాట్లాడుతూ భగవంతుడు అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడుకి చెప్పినట్లుగా తెలంగాణలో అవినీతిలేని చోటు లేదని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ అంటేనే అవినీతి అని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు భగవంతుడే తీసుకువచ్చాడా? అన్నట్లుగా కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపం బయటపడిందని చెబుతూ అవినీతి విషయంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని వివరించారు. నీటి పారుదల, పేపర్ లీకేజీలు, రైతు బంధు సహా రైతుల అంశాలు… ఇలా ఎన్నోచోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారు.
అందుకే తమ చార్జ్ షీట్లో ఈ అంశాన్నింటిని ప్రస్తావించామని తెలిపారు. దేశంలో అవినీతికి ఉదాహరణగా తెలంగాణ ప్రభుత్వాన్ని చెప్పుకోవచ్చునని ధ్వజమెత్తారు. అవినీతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం నడవడం లేదని తేల్చి చెప్పారు. రుణమాఫీ వడ్డీలకే సరిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు. పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్ ఒక్కటీ ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు. దళిత ముఖ్యమంత్రి మొదలు దళితబంధు వరకు అన్నీ అబద్ధపు హామీలే ఇచ్చారని విమర్శించారు.
బిజెపి డిజిటల్ ప్రచార రథాలు
మరోవంక, రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసేందుకు బీజేపీ డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించింది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సోమవారం ఈ వాహనాలను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎన్నికల డిజిటల్ ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల ఇన్ ఛార్జ్ ప్రకాష్ జవదేకర్, బిజెపి ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వాహనాల ప్రారంభోత్సవం అనంతరం వారు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా ఎల్బీ స్టేడియంలో జరగనున్న బీసీ ఆత్మగౌరవ సభ ఏర్పాట్లను పరిశీలించారు.
More Stories
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న మంత్రి
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ వారే
రజాకార్ల గుప్పిట్లో నుండి హైదరాబాద్ విముక్తికై బిజెపికి ఓటు