పుట్టిన రోజు నాడు 12 రికార్డులను అందుకున్న విరాట్ కోహ్లీ

కింగ్‌ కోహ్లీ తన పుట్టిన రోజు నాడు యావత్‌ భారతావనికి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు. బొంగరం కన్నా ఎక్కువ స్పిన్‌ తిరుగుతున్న పిచ్‌పై మూడంకెల స్కోరుతో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వన్డే సెంచరీలను సమం చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు.  సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెలరేగుతున్నాడు. 
 
ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. రెండు సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో ఈ టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ కోహ్లీ రెచ్చిపోయాడు. అజేయ సెంచరీతో దుమ్ములేపాడు. ఆదివారం కోహ్లీ పుట్టిన రోజు కూడా కావడం గమనార్హం.
 
పుష్కర కాలం క్రితం స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించిన అనంతరం క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ను భుజాలమీద ఎత్తుకొని తిరిగిన ఆ పాల బుగ్గల పసివాడు పన్నెండేండ్లు తిరిగేసరికి మాస్టర్‌ బ్లాస్టర్‌ సరసన చేరాడు. వన్డే ఫార్మాట్‌లో సచిన్‌ నెలకొల్పిన 49 శతకాల రికార్డును తిరగరాయడం అసాధ్యం అనుకుంటే దాన్ని అవలీలగా సుసాధ్యం చేసి చూపాడు. 
 
గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌కు ఈ మార్క్‌ చేరేందుకు 451 ఇన్నింగ్స్‌లు అవసరమైతే కేవలం 277 ఇన్నింగ్స్‌ల్లోనే అతడు దాన్ని అందుకున్నాడు. ఈడెన్‌ గార్డెన్స్‌లోనే తొలి వన్డే సెంచరీ నమోదు చేసుకున్న ఆ ఆధునిక క్రికెట్‌ దేవుడు పుట్టినరోజు నాడు తన గురువు రికార్డును సమం చేసి శభాష్‌ అనిపించుకున్నాడు. 
 
టెండూల్కర్‌ ఆడిన చివరి వన్డేలో పాకిస్థాన్‌పై హాఫ్‌ సెంచరీతో సరిపెట్టుకుంటే, అదే పోరులో మాస్టర్‌ ఘనతలను ముందుకు తీసుకెళ్లడానికి నేనొస్తున్నాను అని దాయాది బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ 183 పరుగులు చేసిన విరాట్‌ ఆటతీరును ప్రశంసించేందుకు మాటలు కరువయ్యే పరిస్థితి తీసుకొచ్చాడు! అంతర్జాతీయ క్రికెట్‌పై చెరగని ముద్ర వేసుకున్నాడు.
 
ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 12 రికార్డులను కూడా ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రికార్డుల కింగ్ అనిపించుకున్నాడు.

49- సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో సాధించిన సెంచరీ వన్డే ఫార్మాట్లో కోహ్లీకి 49వది. దీంతో ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేశాడు. కాగా సచిన్ కంటే వేగంగా కోహ్లీ 49 సెంచరీల మార్కును అందుకున్నాడు. అలాగే కోహ్లీ తన మొదటి వన్డే సెంచరీతోపాటు 49వ వన్డే సెంచరీని కూడా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలోనే సాధించడం గమనార్హం.

50- వైట్ బాల్ క్రికెట్‌లో అనగా వన్డేలు, టీ20ల్లో కలిపి కోహ్లీకి ఇది 50వ సెంచరీ. దీంతో వైట్ బాల్ క్రికెట్‌లో 50 సెంచరీలు చేసిన మొదటి బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కాగా కోహ్లీ వన్డేల్లో 49 సెంచరీలతోపాటు టీ20ల్లో కూడా ఓ సెంచరీ చేశాడు.

3- ఈ మ్యాచ్‌లో చేసిన రన్స్ ద్వారా ప్రపంచకప్‌లో కోహ్లీ 1,500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ మూడో స్థానానికి చేరుకున్నాడు.

119- కోహ్లీ సాధించిన సెంచరీ వన్డే ఫార్మాట్లో అతనికి 119వ 50+ స్కోర్ కావడం గమనార్హం. దీంతో వన్డేల్లో అత్యధిక సార్లు 50+ స్కోర్లు సాధించిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర(118) రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో మాష్టర్ బ్లాష్టర్ సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. కాగా సచిన్ 145 సార్లు 50+ స్కోర్లు సాధించాడు.

5- వన్డేల్లో సౌతాఫ్రికాపై కోహ్లీకి ఇది ఐదో సెంచరీ. దీంతో ఈ ఫార్మాట్లో సౌతాఫ్రికాపై అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్, డేవిడ్ వార్నర్ రికార్డును కోహ్లీ సమం చేశాడు.

7- అంతర్జాతీయ క్రికెట్‌లో పుట్టిన రోజు నాడు సెంచరీ చేసిన ఏడో బ్యాటర్ విరాట్ కోహ్లీ. భారత్ తరఫున మూడో ఆటగాడు. ప్రపంచకప్‌లో పుట్టిన రోజు నాడు సెంచరీ సాధించిన మూడో ఆటగాడు. మొత్తంగా కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ, సనత్ జయసూర్య, రాస్ టేలర్, టామ్ లాథమ్, మిచెల్ మార్ష్ పుట్టిన రోజు నాడు సెంచరీ సాధించారు.

22- వన్డేల్లో మొదట బ్యాటింగ్ చేసినప్పుడు విరాట్ కోహ్లీకి ఇది 22వ సెంచరీ. దీంతో వన్డేల్లో మొదటి బ్యాటింగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ (22)ను సమం చేశాడు.

6046- ఈ మ్యాచ్‌లో చేసిన రన్స్ ద్వారా వన్డేల్లో స్వదేశంలో కోహ్లీ 6 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో స్వదేశంలో వేగంగా ఈ మార్కు అందుకున్న బ్యాటర్‌గా నిలిచాడు.

1- ఈ మ్యాచ్‌లో అందుకున్న ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద్వారా ఐసీసీ టోర్నమెంట్లలో అత్యధికసార్లు ఈ అవార్డు అందుకున్న ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. కాగా వన్డే ఫార్మాట్లో కోహ్లీకి ఇది 41వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు.

55- అంతర్జాతీయ క్రికెట్‌లో తమ జట్టు గెలిచిన మ్యాచ్‌ల్లో అత్యధిక సార్లు సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్‌తో కలిసి విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. వీరిద్దరు తమ తమ జట్టు గెలిచిన మ్యాచ్‌ల్లో 55 సెంచరీలు నమోదు చేశారు.

3058- సౌతాఫ్రికాపై అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ కోహ్లీ 3 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు సౌతాఫ్రికాపై అన్ని ఫార్మాట్లలో కలిపి 58 మ్యాచ్‌లాడిన కోహ్లీ 3,058 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో సౌతాఫ్రికాపై విరాట్ 1,500 పరుగులను పూర్తి చేసుకున్నాడు.

*విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో తొలి సెంచరీని కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లోనే కొట్టాడు. తాజాగా సచిన్ రికార్డును సమం చేసే 49వ సెంచరీ సైతం అదే వేదికపై నమోదు చేశాడు.