‘మేడిగడ్డ’ కేంద్రం నివేదికపై తెలంగాణ అభ్యంతరం

మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పంపిన నివేదికపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ ఆరు పేజీల లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వివరాలను సరిగ్గా పరిశీలించకుండానే,  అర్థం చేసుకోకుండానే హడావుడిగా నివేదిక ఇచ్చారని ఆప్పించారు. 17 అంశాలపై సమాచారమిస్తే 11 ఇచ్చామంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
20 అంశాలపై సమాచారం కోరితే 11 మాత్రమే ఇచ్చినట్లు నివేదికలో తెలిపారని పేర్కొంటూ  బ్యారేజీ పరిశీలన, అనంతరం జరిగిన సమావేశంలో డ్యాం సేఫ్టీ అధికారులు అడిగిన అన్ని పత్రాలను చూపించామని, ఆ తర్వాత 20 పత్రాలు  పంపాలని గత నెల 27న లేఖ వచ్చిందని,  పనిదినాలు కాకపోయినా 29న సాయంత్రానికి 17 పంపామని తెలిపారు. మిగిలిన మూడింటినీ నవంబరు 1న మెయిల్ ద్వారా అందించామని స్పష్టం చేశారు. 

ఈ పత్రాలను చూసుకోకుండానే కాళేశ్వరం ప్రాజెక్టుపై తొందరపాటుతో నివేదికను ఇచ్చారని ఆక్షేపించారు.  ఎన్‌డీఎస్‌ కమిటీ భూగర్భ పరీక్షలు లేకుండానే పిల్లర్‌ కుంగుబాటును ఎలా నిర్ధారిస్తారు? అని ప్రశ్నించారు. బ్యారేజీ పునాది పూర్తిగా నీటితో నిండి ఉందని చెబుతూ విచారణ చేయకుండానే మేడిగడ్డ బ్యారేజీ సంఘటనపై నిర్ధారణకు రావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు

నీటిని మళ్లించి బరాజ్‌ నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు వీలుగా కాఫర్‌ డ్యాం నిర్మాణం చేపట్టామని పేర్కొంటూ ఆ పరిశోధనాత్మక పని పూర్తయిన తర్వాత మాత్రమే పిల్లర్ల మునకకు కారణాలు అంచనా వేయగలుగుతామని చెబుతూ ప్రస్తుతానికి కేంద్రం నిర్ధారణలతో  ఏకీభవించలేకపోతున్నామని తేల్చి చెప్పారు.

అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన నివేదికాలు నిరాధారమైనవని పేర్కొంటూ నిపుణుల కమిటీ రెండు బ్యారేజీలను అసలు సందర్శించలేదని గుర్తు చేశారు. బీఐఎస్‌ సూచించిన ప్రమాణాలు, సంబంధిత మార్గదర్శకాలకు అనుగుణంగా సెకాంట్‌ పైలింగ్‌ కార్యకలాపాలు నిర్వహించాముని స్పష్టం చేశారు.

ప్రాజెక్ట్‌ అమలు సమయంలో నాణ్యత నియంత్రణకు సంబంధించిన ఎన్‌డీఎస్‌ఏ కమిటీ తన రిపోర్ట్‌లో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారవేసారు. 13.12.2021 నుంచి డ్యామ్‌ భద్రతా చట్టం అమలులోకి వచ్చిందని చెబుతూ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు 12-07-2023న మాత్రమే నిర్దేశిత ఆనకట్టల జాబితాలో చేర్చారని గుర్తు చేశారు. 

హైడ్రాలజీ, కాస్టింగ్‌, ఇరిగేషన్‌ ప్లానింగ్‌, పర్యావరణ అనుమతులు తదితర అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 06.06.2018న జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన సాంకేతిక సలహా కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.