‘మోదీ కి గ్యారంటీ’ పేరుతో బీజేపీ ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రణాళిక

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శుక్రవారంనాడు విడుదల చేశారు. ‘మోదీ కి గ్యారెంటీ 2023’ పేరుతో రాయపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. రాబోయే ఐదేళ్లలో ఛత్తీస్‌గఢ్‌ను పూర్తి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్దిదిద్దుతామని ఈ సందర్భంగా అమిత్‌షా హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

‘కృషి ఉన్నతి యోజన’ కింద ఎకరాకు 21 క్వింటాళ్ల పంటను సేకరిస్తామని, వివాహిత మహిళందరికీ ఏడాదికి రూ.12,000 చొప్పున ఇవ్వాలని నిర్ణయించామని అమిత్‌షా చెప్పారు. రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద అందించే ఆరోగ్య భీమా మొత్తాన్ని రూ 5 లక్షల నుండి రూ 10 లక్షలకు రెట్టింపు చేస్తామని వెల్లడించారు.

ప్రధాన మంత్రి యోజన కింద 18 లక్షల ఇళ్లు నిర్మిస్తామని, ట్యాప్‌ల ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్లు అందిస్తామని, కౌలు రైతులకు వార్షికంగా రూ.10,000 సాయం అందిస్తామని, కొత్తగా 500 జన్ ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పేద మహిళలకు రూ 500  లకే కుకింగ్ గ్యాస్ సిలెండర్ ఇవ్వడంతో పాటు విద్యార్థులకు విద్యా సంస్థలకు వెళ్లేందుకు `ప్రయాణ భత్యం’ అందిస్తామని కూడా బీజేపీ ప్రకటించింది.

యువతకు పరిశ్రమలు నెలకొల్పేందుకు వడ్డీలేని రుణాలు ఇవ్వడంతో పాటు సగం మొత్తం సబ్సిడీగా అందిస్తామని ప్రకటించారు.  బీపీఎల్ కుటుంబాలలో బాలికలు పుట్టగానే వారి పేరుతో రూ. 1.5 లక్షల హామీ సర్టిఫికెట్ అందిస్తామని తెలిపారు.

అంతకు ముందు, పండారియా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్‌షా మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో ఉండేవన్నీ కుంభకోణాలేనని, బీజేపీకి అధికారం ఇస్తే అవినీతికి పాల్పడే వాళ్లను జైళ్లకు పంపుతామని ప్రకటించారు. ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ కాంగ్రెస్‌కు ‘ప్రీపెయిడ్ సీఎం’ అని విమర్శించారు. 

రాష్ట్ర ఖజానాను కాంగ్రెస్ పార్టీకి ఎటీఎంగా మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో మతమార్పిడులు పెరిగిపోతుంటాయని, రాజ్యాంగం ప్రతి మనిషికి తమకు నచ్చిన మతవిశ్వాసాలు పాటించే హక్కు ఇచ్చినప్పటికీ పేద గిరిజనుల మతమార్పిడికి రాష్ట్ర యంత్రాగాన్ని కాంగ్రెస్ వినియోగిస్తోందని అమిత్ షా ధ్వజమెత్తారు.

ఫలితంగా రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో, గ్రామంలో ఘర్షణలు తలెత్తుతున్నాయని, శాంతి భద్రతల పరిస్థితి క్షీణిస్తోందని ఆయన చెప్పారు. కాగా, 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి తొలి విడతగా నవంబర్ 7న 20 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది. తక్కిన 70 నియోజకవర్గాల్లో నవంబర్ 17న తుది విడత పోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి.

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 సీట్లలో  68 స్థానాలు గెలుచుకుని 15 ఏళ్ళ బిజెపి పాలన తర్వాత అధికారంలోకి వచ్చింది. బీజేపీ కేవలం 15 సీట్లకే పరిమితమైంది. మాజీ సీఎం అజిత్ జోగి సారథ్యంలోని జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జే) 5 సీట్లు, బీఎస్‌పీ 2 సీట్లు గెలుచుకున్నాయి.