కేంద్రం సహకారం అందిస్తున్నా అభివృద్ధిలో ఏపీ విఫలం

ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సహకారం అందిస్తున్నా అభివృద్ధి చేయడంలో వైసిపి ప్రభుత్వం విఫలమవుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి డి. పురందేశ్వరి విమర్శించారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేకపోయారని ఆమె విచారం వ్యక్తం చేశారు. 

అన్నమయ్య జిల్లా రాజంపేట పర్యటన సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెనకబడి ప్రాంతాల అభివఅద్ధి కోసం ఏడాదికి రూ.350 కోట్ల చొప్పున కేంద్రం నిధులు విడుదల చేస్తోందని తెలిపారు. అయినా సీఎం జగన్‌ కనీసం రహదారులు కూడా నిర్మించలేక పోయారని ధ్వజమెత్తారు.

వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో సరైన విద్యాసంస్థలు అందుబాటులో లేవని చెబుతూ రాజంపేటలో కేంద్రీయ విద్యాలయం మంజూరైతే స్థలం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆమె విమర్శించారు. కడప – బెంగళూరు రైల్వే లైన్‌ కోసం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో పనులు ప్రారంభిస్తే జగన్‌ మాత్రం ఆ లైన్‌ వద్దని కేంద్రానికి లేఖ రాయడం ఎంతవరకు సమంజసమని పురందేశ్వరి ప్రశ్నించారు. 

రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ఆ పాలన ఎలా ఉందో ప్రజలే గుర్తించాలని ఆమె సూచించారు. అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి మూడేళ్లవుతున్నా వాటి నిర్మాణానికి నిధులు కేటాయించలేదని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై సీబీఐ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని పురందేశ్వరి చెప్పారు.

రాజంపేట జిల్లా సెట్టిగుంట గ్రామంలో చీప్ లిక్కర్ తాగటం వల్ల మరణించిన ఎస్. చిన్న అభా కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరుగుతూ ఉండటం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని ఆమె మండిపడ్డారు.