కాంగ్రెస్ ను లేపే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుండి బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి తెలంగాణ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఆరోపించారు.   బుధవారం ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసంలో కొందరు నేతల చేరిక సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడుతున్నారని, ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

2018లో కాంగ్రెస్ పార్టీతో కలిసి తెర ముందు ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు కాంగ్రెస్ గెలుపు కోసం తెర వెనుక వ్యూహాలు రచిస్తున్నారని ఆరోపించారు. అయితే, కాంగ్రెస్ గత చరిత్ర అంతా జనానికి తెలుసని, అదేమీ కొత్త పార్టీ కాదని తెలిపారు. ఇవాళ కొంతమంది ఆ పార్టీలో చేరుతున్నప్పుడు కొంత పెరిగినట్టుగా కనిపిస్తుందని, కానీ ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి విశ్వాసం లేదని స్పష్టం చేశారు.

2014లో కౌన్సిల్లో ఉన్న సభ్యులందరూ నాటి టీఆర్ఎస్ పార్టీలో చేరారని, 2018లో 19 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ నుంచి గెలిస్తే 12 మంది ఏకంగా పార్టీని విలీనం చేశారని రాజేందర్ గుర్తుచేశారు. అలాంటి చరిత్ర కల్గిన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మరోసారి బీఆర్ఎస్ పంచన చేరరన్న నమ్మకం ప్రజలకు కలగడం లేదని తేల్చి చెప్పారు.

కేసీఆర్ వద్దు అని కోరుకుంటూ కాంగ్రెస్‌కు ఓటేస్తే చివరకు కేసీఆర్‌కే ఓటేసినట్టు అవుతుందని ప్రజలను హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలో ఎవరికి ఓటేసినా ఒకటేనని అంటూ ఇప్పుడు కూడా బీఆర్ఎస్‌కు ఓటేసినా, కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసిన.. చివరికి కేసీఆర్‌ను సీఎం అవుతారని తేల్చి చెప్పారు.

బీఆర్ఎస్ బంగాళాఖాతంలో కలవడం ఖాయం

కాగా, కచ్చితంగా తెలంగాణ ప్రజలు ఈసారి ఆ పార్టీని, కేసీఆర్ ను  బంగాళాఖాతంలో ముంచడం ఖాయమని రాజేందర్ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావద్దని కోరుకుంటున్నారని తెలిపారు.  కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజలు బ్రతికి బట్టి బట్టకట్టరని ఈటల హెచ్చరించారు. 
అనేక సంవత్సరాలుగా అనేక విషయాల మీద ఊదరగొట్టిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతా లోపాల మీద సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు.
డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ఎలా మోసం చేశారో ప్రజలందరూ తెలుసుకున్నారని ఆయన ధ్వజమెత్తారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగిస్తుందని రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను గద్దె దించి మంచి పరిపాలన అందించే శక్తి, సత్తా బిజెపికి మాత్రమే ఉందని స్పష్టం చేశారు.  నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఎట్లా పురోగమిస్తుందో దేశ ప్రజలు చూస్తున్నారని చెప్పారు. 
 
తెలంగాణలో కూడా అభివృద్ధి జరగాలంటే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే డబులింజన్ సర్కారుతో సాధ్యపడుతుందని ఆయన తెలిపారు. అనేకమంది కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి వచ్చి బీజేపీలో చేరుతున్నారని చెబుతూ బీఆర్ఎస్ నేతలు ఏ ఊరికి వెళ్లిన కూడా నిరసన సెగలు ఎదురవుతున్నాయని గుర్తు చేశారు.