కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌పై కేరళలో ఎఫ్‌ఐఆర్‌

కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌పై కేరళ పోలీసు  స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. కేరళలో జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో వివిధ మతాల మధ్య విద్వేషాన్ని పెంపొందించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయనపై కేరళ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీలోని సెక్షన్‌ 153(ఏ), కేరళ పోలీసు చట్టంలోని సెక్షన్‌ 120 కింద కేసులు బుక్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

కేరళలోని ఎర్నాకుళం జిల్లా కలమస్సేరిలోని ‘జెహోవా విట్‌నెసెస్‌’ అనే క్రైస్తవ మత గ్రూపు ప్రజలు సమావేశమైన జమ్రా ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం వరుస బాంబు పేలుళ్లు కలకలం రేపిన విషయం తెలిసిందే. కన్వెన్షన్‌ హాలులో ప్రార్థనలు ప్రారంభమైన తర్వాత నిమిషాల వ్యవధిలో మూడుసార్లు పేలుళ్లు జరిగాయి. 

ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా 51 మంది గాయపడ్డారు. కోచ్చిలో ఇటీవల జరిగిన పేలుళ్లు, మలప్పురం జిల్లాలో ఒక ఇస్లామిక్ గ్రూపు నిర్వహించిన సమావేశాన్ని ఉద్దేశించి ఒక హమాస్ నాయకుడు చేసిన వర్చువల్ ప్రసంగంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై కేరళ పోలీసులు తమకు తాముగా కేసు నమోదు చేశారు. ఐపిసిలోని సెక్షన్ 153ఎ, కేరళ పోలీసు చట్టంలోని సెక్షన్ 120 కింద కేంద్ర మంత్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు కోచ్చి నరానికి చెందిన ఒక సీనియర్ పోలీసు అధికారి మంగళవారం తెలిపారు.

కాగా, ఈ ఘటనపై స్పందించిన రాజీవ్ చంద్రశేఖర్‌ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఘాటుగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ‘అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ కళంకితుడైన ముఖ్యమంత్రి పినరయి నీచ సిగ్గుమాలిన బుజ్జగింపు రాజకీయాలు ఆడుతున్నారు. ఢిల్లీలో కూర్చొని ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ.. జిహాద్‌ కోసం బహిరంగ పిలుపులిస్తున్న ఉగ్రవాద హమాస్ కేరళలో అమాయక క్రైస్తవులపై దాడులు, బాంబు పేలుళ్లకు కారణమవుతున్నారు’ అంటూ కేంద్ర మంత్రి ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. కేంద్ర మంత్రి, బిజెపి నాయకుడైన రాజీవ్ చంద్రశేఖర్‌ను అబద్ధాలకోరుగా, విషసర్పంగా అభివర్ణించారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రకటనలు చేస్తే వారు కేంద్ర మంత్రులైనా, రాష్ట్ర మంత్రులైనా సరే వారిపై కేసులు నమోదు పెడతామని ఆయన హెచ్చరించారు.