ఇజ్రాయిల్- హమాస్ ఘర్షణల్లో 21 మంది జర్నలిస్టుల మృతి

ఇజ్రాయిల్- హమాస్ ఘర్షణల్లో 21 మంది జర్నలిస్టుల మృతి

ఈ నెల 7న హమస్‌ ఉగ్ర దాడి, ఆ తరువాత ఇజ్రాయిల్‌ ఎదురు దాడి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 21 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని కమిటీ టూ ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్ (సిపిజె) తెలిపింది. మరణించిన జర్నలిస్టుల్లో 18 మంది పాలస్తీనియున్లు, ముగ్గురు ఇజ్రాయిలీలు, ఒక లెబనాన్‌కు చెందిన జర్నలిస్టు ఉన్నారు. 

ఈ యుద్ధంలో మరో ఎనిమింది జర్నలిస్టులు గాయపడ్డారని తెలిపింది. మరో ముగ్గురు గల్లంతు కావడం లేదా నిర్బంధంలో ఉన్నట్లు పేర్కొంది. మరణించిన 21 మంది జర్నలిస్టుల పేర్లు, వారి వృత్తి పరమైన వివరాలను కూడా సిపిజె ఓ ప్రకటనలో ప్రచురించింది. 

‘హృదయ విదారక యుద్ధాన్ని కవర్‌ చేయడానికి ఈ ప్రాంతంలో జర్నలిస్టులు గొప్ప త్యాగాలు చేస్తున్నారు. అన్ని దేశాలు వారి భద్రతను కాపాడడానికి చర్యలు తీసుకోవాలి’ అని సిపిజె కోరింది. ఈ యుద్ధంలో మరణించిన, గాయపడిన, నిర్భంధించబడిన జర్నలిస్టులకు చెందిన అన్ని వార్తలపై విచారణ చేస్తున్నట్లు తెలిపింది. 

ఈ యుద్ధంలో ఇప్పటివరకు నాలుగు వేల మంది కంటే ఎక్కువ మంది మరణించినట్లు భావిస్తున్నారు. మృతుల్లో అత్యధికులు పాలస్తీనీయులే. కాగా, ఇజ్రాయిల్‌ దిగ్బంధనంతో ఇబ్బందులు పడుతున్న గాజా ప్రజలకు సాయం అందేందుకు వీలుగా సహాయ ట్రక్కులను అనుమతించాల్సిందిగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ విజ్ఞప్తి చేశారు. 

శుక్రవారం ఆయన రాఫా సరిహద్దు క్రాసింగ్‌ను సందర్శించారు. పాలస్తీనియన్లు కూడా అందబోయే సాయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. లెబనాన్‌తో గల సరిహద్దులో హిజ్బులా తీవ్రవాదులతో రోజుల తరబడి ఘర్షణలు కొనసాగించిన అనంతరం ఉత్తర ప్రాంత కిర్యాత్‌ షామోనా నగరాన్ని ఖాళీ చేయనున్నట్లు శుక్రవారం ఇజ్రాయిల్‌ అధికారులు ప్రకటించారు.

మ‌రో వైపు ఈజిప్టు నుంచి స‌హాయ సామాగ్రి ప్ర‌స్తుతం రాఫా బోర్డ‌ర్ వ‌రకు చేరుకున్న‌ది. గాజాకు స‌ర‌కుల్ని పంపేందుకు రాఫా క్రాసింగ్ వ‌ద్ద ట్ర‌క్కుల్ని నిలిపారు. ఐక్య‌రాజ్య‌స‌మితికి చెందిన వాహ‌నాలు అక్క‌డ‌కు చేరుకున్న‌ట్లు తెలుస్తోంది.

జుడిత్‌ తై రానన్‌, ఆమె కుమార్తె 17 ఏళ్ల నటాలీ శోషనా రానన్‌ను హమాస్‌ ఉగ్రవాదులు విడిచిపెట్టినట్లు ఇజ్రాయెల్‌ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఉగ్రవాదుల చెర నుంచి విముక్తిపొందిన ఆ ఇద్దరు అమెరికన్లు శుక్రవారం రాత్రి ఆలస్యంగా ఇజ్రాయెల్‌ చేరుకున్నట్లు తెలిపింది. అమెరికన్లను విడుదల చేయడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతోషం వ్యక్తం చేశారు. బందీలంద‌ర్నీ విడిచిపెట్టే వ‌ర‌కు పోరాటం కొన‌సాగుతుంద‌ని ఇజ్రాయిల్ ప్ర‌ధాని బెంజిమ‌న్ నెతాన్యూ తెలిపారు.
 
అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలపై మెరుపుదాడి చేసిన హమాస్‌ ఉగ్రవాదులు సుమారు 200 మందిని బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. వారిలో ఇజ్రాయెల్‌తోపాటు ఇతర దేశాల పౌరులు ఉన్నారు. హమాస్‌ మిలిటెంట్ల బందీల్లో 20 మందికిపైగా మైనర్లు, 10 నుంచి 20 మంది 60 ఏళ్లకు పైగా ఉన్న వృద్ధులు ఉన్నట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది. 
 
ఇక రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధంలో భారీగా ప్రజలు మృతి చెందారు. హమాస్‌ దాడిలో 1,400 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇజ్రాయెల్‌ దాడిలో సుమారు 4,137 మంది మరణించారు. యుద్ధం నేపథ్యంలో 10 లక్షల మందికిపైగా ప్రజలు గాజాను వీడారు.