అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా బిజెపి మేనిఫెస్టో

అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా బిజెపి మేనిఫెస్టో రూపొందిస్తామని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్యెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో హుజూర్‌నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శ్రీలత రెడ్డి, వివిధ పార్టీల నాయకులు ఆయన సమక్షంలో బిజెపిలో చేరారు. 

వారందరికి పార్టీ కండువాలను కప్పి ఈటల రాజేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్‌రావు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు చేసిన అభివృద్ధి ఏంటో కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. కేసీఆర్ డబ్బులతో ఎన్నికలు గెలివాలని చూస్తున్నారని రాజేందర్ ఆరోపించారు.

ఎమ్మెల్యే అభ్యర్థులకు పోలీసు పహారాలో ఇప్పటికే డబ్బులు పంపించారని, బీజేపీ నాయకులను వెలకట్టి కొనాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తలకాయ కిందపెట్టి.. కాళ్లు పైకిపెట్టినా ఈసారి కేసీఆర్ కి ప్రజలు ఓటు వేసేందుకు సిద్ధంగా లేరని తేల్చి చెప్పారు.  కేసీఆర్ ఇచ్చిన అనేక హామీలు అమలు కాలేదన్నారని చెబుతూ  హుజూరాబాద్‌లో ఎన్నికల సమయంలో తమ ప్రజలను కేసీఆర్ పెట్టిన ఇబ్బందులు చూసి.. గజ్వేల్‌లో తేల్చుకుంటా అని అప్పుడే చెప్పానని గుర్తు చేశారు.

గజ్వేల్ ప్రజల హృదయాల్లో కేసీఆర్ ఉన్నారో.. తాము ఉన్నామో 2023, నవంబర్ 30న తేలిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.  తాను పోకముందే వందలమంది మీటింగ్ పెట్టుకుని తనకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని రాజేందర్ తెలిపారు. హుజూరాబాద్ ప్రజలకు ఉపఎన్నికల్లో తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ఎలాంటి అవకాశం వచ్చిందో.. ఇప్పుడు గజ్వేల్ ప్రజలకు అలాంటి సదావకాశం వస్తుందని భరోసా వ్యక్తం చేశారు.ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి వారు సిద్దమవుతున్నారని తెలిపారు.

అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుని చెప్పారు. ప్రజలను ఓటు అడిగే హక్కు బిజెపికి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ గ్యారెంటీలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నరని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరగాలంటే బిజెపి అధికారంలోకి రావాలని రాజేందర్ స్పష్టం చేశారు.

పార్టీలో చేరిన శ్రీలతారెడ్డి మాట్లాడుతూ అబుదాబిలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం.ఎన్నో ఆశయాలు, ఆకాంక్షలతో పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం. అయితే, బిఆర్‌ఎస్ పాలనలో ప్రజలు ఆకాంక్షలు, లక్ష్యాలు, ఆశయాలు నెరవేరలేదని విమర్శించారు.  చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చి, మహిళలు రాజకీయంగా ఎదగేలా చట్టం తీసుకొచ్చిన ఘనత మోదీ  ప్రభుత్వానిదే ఆమె తెలిపారు. కాగా,  అసెంబ్లీ ఎన్నికలలో హుజూర్‌నగర్ నుంచి బిజెపి అభ్యర్థిగా చల్లా శ్రీలత రెడ్డికే పార్టీ సీటు లభించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

చల్లా శ్రీలత రెడ్డి నేరేడుచర్ల మున్సిపాలిటీలో 13వ వార్డు కౌన్సిలరుగా పోటీ చేసి గెలిచి నేరేడుచర్ల మున్సిపాలిటీలో వైస్‌చైర్‌పర్సన్ గా ఎన్నికయ్యారు. బిఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. కొన్ని రోజులు ఆ పార్టీకి దూరంగా ఉంటూ ఈ నెల 4న బిఆర్‌ఎస్‌కు, వైస్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు. కాగా ఆమె సోదరుడు పోరెడ్డి కిషోర్ రెడ్డి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.

కాగా, నాగార్జునసాగర్ నియోజకవర్గ నాయకులు రంజిత్‌యాదవ్, పాశం గోపాల్ రెడ్డి, యడవల్లి చంద్రశేఖర్‌రెడ్డి, కోదాడ నుండి ఓరుగంటి కిట్టు, పలువురు తెలంగాణ ఉద్యమకారులు ఈటల సమక్షంలో బిజెపిలో చేరారు.