భారతీయ వ్యోమగామిని 2040లోగా చంద్రుడి మీదకు పంపేందుకు ప్రణాళికలు రూపొందించాలని శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. 2035లోగా భారతీయ స్పేస్ స్టేషన్ను నిర్మించాలని కూడా ఆయన శాస్త్రవేత్తలకు దిశానిర్ధేశం చేశారు. గగన్యాన్ మిషన్ సన్నాహాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
మిషన్ సన్నద్ధతను అంచనా వేయడానికి ఈ సమావేశం నిర్వహించారు. చంద్రయాన్ 3 చారిత్రక విజయం , ఆదిత్య ఎల్ 1 ప్రయోగంతో అంతరిక్ష రంగంలో భారత ఖ్యాతి మరింత పెరిగింది. ఆ విజయ పరంపరను కొనసాగిస్తున్న రాబోయే 20 ఏళ్లకు మరిన్ని ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ప్రధాని ఈ సందర్భంగా దేశ శాస్త్రవేత్తలకు సూచించారు.
ఉన్నత స్థాయి సమావేశంలో ఇస్రో శాస్త్రవేత్తలు సమగ్ర నివేదికను ప్రధానికి అందించారు. ఇందులో మిషన్కు సంబంధించిన అనేక ముఖ్యమైన సమాచారం ఉంది. ఈ సమావేశంలో భవిష్యత్ అంతరిక్ష పరిశోధనా ప్రయోగాలపై శాస్త్రవేత్తలకు ప్రధాని పలు సూచనలు చేశారు. శుక్రగ్రహంపై ఆర్బిటర్ మిషన్, అంగారకుడిపై ల్యాండర్ వంటి ప్రయోగాల దిశగా శాస్త్రవేత్తలు కృషి చేయాలని పేర్కొన్నారు.
“ చంద్రయాన్ 3 , ఆదిత్య ఎల్1 విజయాలు అందించిన ఉత్సాహంతో భారత్ ఇప్పుడు మరిన్ని కొత్త, ప్రతిష్ఠాత్మక లక్షాలను నిర్దేశించుకోవాలి. 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, 2040 నాటికి చంద్రుడి పైకి తొలి భారతీయుడిని పంపించే విధంగా ప్రయోగాలు చేపట్టాలి ” అని మోడీ సూచించినట్టు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది.
2025 నాటికి గగన్యాన్ మిషన్ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం 20 ప్రధాన పరీక్షలను నిర్వహించనున్నారు. మొట్టమొదటి క్రూ ఎస్కేప్ సిస్టమ్ పరీక్షను అక్టోబర్ 21న చేపట్టనున్నారు. పరీక్షలో భాగంగా మాడ్యూల్ను అంతరక్షం లోకి పంపడం , దానిని సముద్రంలో పడేలా చేయడం, అనంతరం మోడ్యూల్ను స్వాధీనం చేసుకుని పునర్వినియోగానికి సిద్ధం చేయడం వంటివి చేపట్టనున్నారు.
నౌకాదళం ఇప్పటికే మాడ్యూల్ను తిరిగి పొందేందుకు అవసరమైన మాక్ ఆపరేషన్లను చేపట్టింది. అంతరిక్షంలో వ్యో మనౌక సమస్యను ఎదుర్కొంటే సిబ్బందిని తిరిగి భూమికి తీసుకురావడంలో ఈ టెస్ట్ సాయపడుతుంది. ఈ గగన్యాన్ మిషన్ విజయవంతమైతే భారత్ చేపట్టే మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర ఇదే కానుంది.
భారతదేశ సామర్థ్యాలపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, అంతరిక్ష పరిశోధనలో కొత్త శిఖరాలను అందుకోవడానికి దేశ నిబద్ధతను ప్రధాని మోదీ ధృవీకరించారు. ప్రధానమంత్రి దార్శనికతను దృష్టిలో ఉంచుకుని, ఇస్రో త్వరలో తొలి భారతీయుడిని చంద్రుడిపైకి పంపేందుకు రోడ్మ్యాప్ను రూపొందించనుంది.
దీని కోసం, చంద్రయాన్ మిషన్ల మొత్తం శ్రేణి ఉంటుంది, అలాగే కొత్త తరం లాంచ్ వెహికల్ (ఎన్ జి ఎల్ వి) అభివృద్ధిపై కసరత్తు జరుగుతోంది. దీనితో పాటు, కొత్త లాంచ్ ప్యాడ్ కూడా నిర్మించనున్నారు. మానవ-కేంద్రీకృత ప్రయోగశాలలతో సంబంధిత సాంకేతికతలు అభివృద్ధి చేయనున్నారు.
More Stories
కుమారస్వామి పేరు చెప్తే రూ 100 కోట్లు ఇస్తానన్న శివకుమార్
స్వాతి మలివాల్పై దాడి కేసులో బిభవ్ కుమార్ అరెస్ట్
కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులే లక్ష్యంగా మూక హింస