గల్ఫ్ సంఘాల నాయకులు ఎన్నికల్లో పోటీకి సిద్ధం

దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న గల్ఫ్ కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని యూఏఈ దేశంలోని షార్జాలో జరిగిన తెలంగాణ గల్ఫ్ ప్రవాసీ సంఘాల ప్రతినిధుల సమావేశం అభిప్రాయపడింది. గల్ఫ్ కార్మికుల సమస్యలు, పరిష్కారాల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు.

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గల్ఫ్ లో ఉన్న కార్మికులు, గల్ఫ్ నుంచి వాపస్ వచ్చి గ్రామాల్లో స్థిరపడ్డ వారు, గల్ఫ్ ప్రవాసుల కుటుంబ సభ్యులు ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. సౌదీ అరేబియా నుంచి ఇద్దరు, ఓమాన్ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ముగ్గురు ప్రతినిధులు, యూఏఈ లోని వివిధ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

అజ్మాన్ లోని ఇండియన్ అసోసియేషన్ సమావేశ మందిరంలో ఆదివారం సాయంత్రం గల్ఫ్ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. గల్ఫ్ ప్రవాసుల సంక్షేమమే లక్ష్యంగా అన్ని గల్ఫ్ సంఘాలు ఒక్కతాటిపైకి రావాలని సమ్మేళనం అభిప్రాయపడింది.  గల్ఫ్ బాధిత కుటుంబాలు, గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యులతో కామారెడ్డి లాంటి ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా నామినేషన్లు వేయించాలని ఒక సూచన వచ్చింది. 

సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, జగిత్యాల, బాల్కొండ, నిర్మల్ లాంటి గల్ఫ్ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాలలో గల్ఫ్ కార్మిక నాయకులు పోటీ చేయాలనే మరొక  ప్రతిపాదన వచ్చింది. కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలలో గల్ఫ్ కార్మిక కుటుంబాలతో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని సమావేశం అభిప్రాయపడింది.

గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న తెలంగాణ ప్రవాసులు వాట్సాప్, బోటిం, ఇఎంఓ, ఎఫ్బీ మెసెంజర్ లాంటి యాప్స్ ద్వారా తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి గల్ఫ్ సంఘాల అభ్యర్థులకు ఓట్లు వేయించాలని కోరారు. జీరో బడ్జెట్ నినాదంతో కార్పొరేట్ రాజకీయ వ్యవస్థను ఎదుర్కోవాలని కోరారు.  ఎన్నారై పాలసీతో కూడిన గల్ఫ్ బోర్డు సాధనే తమ లక్ష్యమని, తమ సంఘాల మధ్యన ఎలాంటి విభేదాలు లేవని వక్తలు అభిప్రాయపడ్డారు. మిగతా అన్ని  గల్ఫ్ సంఘాలను కలుపుకొని ముందుకెళ్లాలని సమావేశం నిర్ణయించింది.