ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను హెచ్చరించిన ఢిల్లీ కోర్టు

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజ‌య్ సింగ్‌ ను ఢిల్లీ కోర్టు హెచ్చరించింది. కోర్టు గదిలో రాజ‌కీయ ప్ర‌సంగాలు ఇవ్వ‌డం ప‌ట్ల అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఢిల్లీ మద్యంకేసులో అరెస్టులో ఉన్న సమయంలో మ‌నీల్యాండ‌రింగ్ కేసులో కోర్టుకు హాజరైన ఎంపీ సంజ‌య్ సింగ్‌ స్పెష‌ల్ జ‌డ్జి నాగ‌పాల్ ముందు మాట్లాడుతూ వ్యాపార‌వేత్త గౌత‌మ్ అదానీ గురించి ప్ర‌స్తావించారు. 
 
ఆ స‌మ‌యంలో జ‌డ్జి నాగ‌పాల్ సీరియ‌స్ అయ్యారు. అదానీ, న‌రేంద్ర‌మోదీ గురించి ప్ర‌సంగం చేయాల‌నుకుంటే, త‌ర్వాత విచార‌ణ‌లను వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా చేయ‌నున్న‌ట్లు జ‌డ్జి పేర్కొన్నారు. అదానీపై ఇచ్చిన ఫిర్యాదుల ప‌ట్ల విచార‌ణ ఏజెన్సీలు స‌రైన రీతిలో ప‌నిచేయ‌లేద‌ని సింగ్ ఆరోపించారు.

సంబంధం లేని విషయాల గురించి మాట్లాడవద్దని సంజయ్‌సింగ్‌కు న్యాయమూర్తి హెచ్చరించారు. గౌతమ్ అదానీపై తాను చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు సంస్థలు పనిచేయడం లేదని సంజయ్ సింగ్ కూడా ఆరోపించారు. ఈడీ దర్యాప్తులో తనను కూడా సంబంధం లేని ప్రశ్నలు అడిగారని సంజయ్‌సింగ్ న్యాయస్థానానికి తెలిపారు.

‘నా తల్లి నుంచి ఎందుకు డబ్బులు తీసుకున్నాను? నాభార్యకు ఎందుకు రూ.10,000 ఎందుకు పంపాను?వంటి  అనవసరమైన ప్రశ్నలతో ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌గా మారింది. అన్నీ అబద్ధాలే. అదానీపై ఫిర్యాదు చేశాను. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.’ అని సంజయ్ సింగ్ పేర్కొన్నారు. 

ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత మరో రెండు వారాల రిమాండ్ పెంచాలని ఈడీ అభ్యర్థన మేరకు, న్యాయస్థానం అక్టోబర్ 27 వరకు సంజయ్‌సింగ్ రిమాండ్‌ను పొడిగించింది.