పాస్‌పోర్టు కుంభకోణంలో 50 చోట్ల సిబిఐ సోదాలు

నకిలీ పాస్ పోర్టులు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సీబీఐ అధికారులు. పలు ప్రాంతాల్లో జరిగిన ఈ తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ దందా ఏళ్లుగా నడుస్తోందని తెలుస్తోంది. విశ్వసనీయంగా తెలిసి సమాచారంతో దాడులు జరిపిన సీబీఐ చాలా మందిపై కేసులు నమోదు చేసింది. 
 
వారు తెలిపిన వివరాల ప్రకారం సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లలో నకిలీ పాస్ పోర్టులు తయారు చేస్తున్నారన్న సమాచారంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు.  ఆయా రాష్ట్రాల్లో 50 ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పీఎస్ఎల్‌కే సీనియర్ సూపరింటెండెంట్‌తో పాటు ఓ మధ్యవర్తి కూడా పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. 
 
నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా పాస్‌పోర్ట్‌లు తయారు చేస్తున్నారన్న ఆరోపణలతో ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ వ్యక్తులతో సహా 24 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌లో 16 మంది అధికారులతో సహా 24 మంది వ్యక్తుల పేర్లు ఉన్నాయి.  
 
వారు లంచాలకు బదులుగా అనర్హులకు, నాన్-రెసిడెంట్‌లకు నకిలీ పత్రాల ఆధారంగా పాస్‌పోర్ట్‌లు జారీ చేశారని పోలీసులు వెల్లడించారు. ఈ సోదాలు కోల్‌కతా, సిలిగురి, గ్యాంగ్‌టక్ తదితర ప్రాంతాల్లో జరిగినట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌టక్‌లో పనిచేస్తున్న ఒక అధికారితోపాటు ఒక దళారీని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.