తెలంగాణాలో నవంబర్ 30న ఎన్నికలు

తెలంగాణ‌లో పాటు నాలుగు రాష్ట్రాల‌కు ఎన్నిక‌ల నగారా మోగింది. తెలంగాణ‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నిక‌ల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది. ఆయా రాష్ట్రాల్లో నవంబర్​ 7 నుంచి నవంబర్​ 30 మధ్యలో పోలింగ్​ జరుగుతుంది.

  • మిజోరంలో నవంబర్​ 7న ఒక దశలో పోలింగ్​ జరగనుంది. డిసెంబర్​ 3న కౌంటింగ్​ ప్రక్రియ ఉంటుంది.
  • ఛత్తీస్​గఢ్​లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ తేదీ నవంబర్​ 7గా ఉండగా, రెండో దశ తేదీ నవంబర్​ 17గా ఉంది. డిసెంబర్​ 3న ఫలితాలు వెలువడతాయి.
  • మధ్యప్రదేశ్​లో నవంబర్​ 17న ఒకే దశలో పోలింగ్​ జరగనుంది. డిసెంబర్​ 3న ఫలితాలను ప్రకటిస్తుంది ఈసీ.
  • రాజస్థాన్​లో నవంబర్​ 23న పోలింగ్​ ఉంటుంది. ఫలితాలు డిసెంబర్​ 3న బయటకు వస్తాయి.
  • తెలంగాణాలో నవంబర్​ 30న ఒక దశలో పోలింగ్​ జరుగుతుంది. అన్ని రాష్ట్రాలతో కలిపి.. డిసెంబర్​ 3న ఫలితాలు వెలువడతాయి.

5 రాష్ట్రాల్లో 1.77లక్షల పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ 1.77లక్షల పోలింగ్​ కేంద్రాల్లో 17,734 మోడల్​ పోలింగ్​ స్టేషన్స్​ ఉంటాయని, 621 పోలింగ్​ కేంద్రాలను పీడబ్ల్యూడీ సిబ్బంది నిర్వహిస్తారని స్పష్టం చేసింది. ఈసారి 5 రాష్ట్రాల్లో దాదాపు 60లక్షల మంది తొలిసారి ఓటు హక్కు సాధించారని తెలిపింది. మొత్తం మీద ఈ 5 రాష్ట్రాల్లో దాదాపు 16కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ 40 రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో ప‌ర్య‌టించి,  ఐదు రాష్ట్రాల అధికారులు, పార్టీల నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపామని తెలిపారు. వివిధ రాజ‌కీయ పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని, ఈ ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల కోసం ఆరు నెల‌లుగా క‌స‌ర‌త్తు చేస్తున్నాం అని వివరించారు.

తెలంగాణ‌లో 119, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 90, మిజోరాంలో 40, రాజ‌స్థాన్‌లో 200, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు సీఈసీ పేర్కొన్నారు. మొత్తంలో ఐదు రాష్ట్రాల్లో 679 శాస‌న‌స‌భ స్థానాలున్నాయ‌ని తెలిపారు. మిజోరాం శాస‌న‌స‌భ ప‌ద‌వీకాలం డిసెంబ‌ర్ 17, ఛ‌త్తీస్‌గ‌ఢ్ జ‌న‌వ‌రి 3, మ‌ధ్య‌ప్ర‌దేశ్ జ‌న‌వ‌రి 8, రాజ‌స్థాన్ జ‌న‌వ‌రి 14, తెలంగాణ శాస‌న‌స‌భ ప‌ద‌వీకాలం జ‌న‌వ‌రి 18 ముగియనున్న‌ట్లు పేర్కొన్నారు.

తెలంగాణలో మొత్తం 119 సీట్లు ఉండగా మెజారిటీ సాధించాలంటే 60 స్థానాల్లో గెలవాల్సిందే. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ 88 సీట్లలో గెలిచింది. కాంగ్రెస్​కు 19 సీట్లు దక్కాయి. బీజేపీ ప్రభావం చూపించలేకపోయింది. ఛత్తీస్​గఢ్​లో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మెజారిటీ మార్క్​ వచ్చేసి 46. 2018లో 68 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్​  బీజేపీని ఓడించి ప్రభుత్వాన్ని స్థాపించింది. బీజేపీకి 15 సీట్లే వచ్చాయి!

రాజస్థాన్​లో  2018లో అప్పటివరకు అధికారంలో ఉన్న బీజేపీని ఓడించింది కాంగ్రెస్​. 200 సీట్ల అసెంబ్లీలో మెజారిటీ మార్క్​ పొందాలంటే 101 స్థానాల్లో గెలవాల్సి ఉంది. నాటి ఎన్నికల్లో ఏకంగా 108 సీట్లు సాధించింది కాంగ్రెస్​. బీజేపీకి 73 సీట్లే వచ్చాయి. మధ్యప్రదేశ్​లో మొత్తం 230 సీట్లు ఉన్నాయి. 116 మ్యాజిక్​ ఫిగర్​. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో 114 సీట్లు సాధించి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది​. బీజేపీకి 109 స్థానాలే దక్కాయి. కాంగ్రెస్​ ప్రభుత్వాన్నిస్థాపించినా నిలబెట్టుకోలేకపోయింది. ప్రస్తుతం అక్కడ బీజేపీ అధికారంలో ఉంది.

ఈశాన్య భారత దేశంలో భాగమైన మిజోరంలో మొత్తం 40 సీట్లు ఉన్నాయి. మ్యాజిక్​ ఫిగర్​ 21. 2018 ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్ ఇక్కడ ఎన్డీయే కూటమి విజయం సాధించింది. మొత్తం 26 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్​ పార్టీ కేవలం 5 చోట్లే ఖాతా తెరవగలిగింది.