సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కేంద్రం

సింగరేణి ఎన్నికలపై వివాదం రాజుకుంటూనే ఉంది. ఈ ఎన్నికలపై కేంద్ర కార్మిక శాఖ తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. కార్మిక సంఘం ఎన్నికలకు సింగరేణి యాజమాన్యం సహకరించడంలేదని కేంద్ర కార్మిక శాఖ పిటిషన్‌ దాఖలు చేసింది.  సెప్టెంబర్‌ 27న మీటింగ్‌కు సింగరేణి యాజమాన్యం హాజరు కాలేదని కేంద్ర కార్మిక సంఘం పేర్కొంది. 
సింగరేణి తుది ఓటర్ల జాబితాను ఇప్పటి వరకు ప్రకటించలేదని వెల్లడించింది. హైకోర్టు ఆదేశాలతో ఈనెల 28న ఎన్నికల షెడ్యూల్‌ జారీ చేశామని కేంద్రం పేర్కొంది.  సింగరేణి సహాయ నిరాకరణ వల్ల ఎన్నికలకు వెళ్లలేకపోతున్నామని వెల్లడించింది. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని సింగరేణి యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్రం పిటిషన్‌లో తెలిపింది.

ఇక, సింగరేణి అప్పీల్‌తో కలిపి కేంద్ర కార్మికశాఖ పిటిషన్‌పై ఈనెల 11న విచారణ చేపట్టనున్నట్టు ఉన్నత న్యాయం స్థానం చెప్పింది. ఎన్నికలను వాయిదా వేయాలని కార్మిక సంఘాలు సింగరేణి యాజమన్యాన్ని కోరింది. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేశాయి. దీనిపై అక్టోబర్‌ 5న విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయ్యే వరకు కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది.

అయితే, ఈ నెలాఖరులోగా కార్మిక సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలని ఇప్పటికే సింగిల్‌ జడ్జి తీర్పు చెప్పింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తూ సింగరేణి అప్పీలుపై తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర కార్మిక శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.