ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆప్ ఎంపీ ఇంట్లో సోదాలు

 
రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం ఉదయం 7 గంటల నుండి సంజయ్ సింగ్ ఇంటికి చేరుకున్న అధికారుల సోదాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
 
ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో సంజయ్ సింగ్ పేరును మూడు చోట్ల ప్రస్తావించారు. ఇదివరకు ఆయన సిబ్బందిని, ఆయనతో సంబంధం ఉన్నవారిని అధికారులు విచారించారు.  ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఫిబ్రవరిలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
దీంతో అప్పటి నుంచి ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మద్యం పాలసీ కేసులో కేంద్ర ఏజెన్సీల స్కానర్‌లో ఉన్న తాజా ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ కూడా ఉన్నారు.  ఢిల్లీ ప్రభుత్వం 2021 నాటి మద్యం పాలసీకి సంబంధించి ఎక్సైజ్ పాలసీ కేసు దాఖలు చేశారు. కానీ ఆ తరువాత రద్దు చేశారు. ఏప్రిల్‌లో ఇదే కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించారు.
ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో మద్యం కంపెనీల ప్రమేయం ఉందని, దీనివల్ల సంస్థలకు 12 శాతం లాభం చేకూరుతుందని సీబీఐ వాదిస్తోంది.  “సౌత్ గ్రూప్” అని పిలిచే ఒక మద్యం లాబీ దాని కోసం కిక్‌బ్యాక్ చెల్లించిందని సీబీఐ ఆరోపించింది. ఆ 12 శాతం లాభంలో ఆరు శాతం మధ్యవర్తుల ద్వారా ప్రభుత్వోద్యోగులకు మళ్లించబడిందని సీబీఐ పేర్కొంది. మరోవైపు కిక్‌బ్యాక్‌ల లాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. 
 
ఈ విధానాన్ని రద్దు చేసిన తర్వాత, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం పాత మద్యం పాలసీకి తిరిగి వెళ్లిందని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఎలాంటి తప్పు చేయలేదని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది. ఆయన అరెస్ట్‌ను ఖండించింది.  అలాగే మనీష్ సిసోడియాను అరెస్టు చేయడం “ఢిల్లీ పాలన నమూనాపై దాడి”గా పేర్కొంది. ఇక ఇదే కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత కూడా విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
 
కాగా, ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్‌తో ముడిపడి ఉన్న మనీల్యాండరింగ్ కేసులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ్ మాగుంట, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త దినేష్ అరోరా అప్రూవర్లుగా మారడానికి ఢిల్లీ కోర్టు మంగళవారం అంగీకరించింది. ఈడీ అరెస్టు చేసిన ఈ ఇద్దరూ ప్రస్తుతం బెయిలులో ఉన్నారు. అంతకు ముందు అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డి ఈ కేసులో అప్రూవర్‌గా మారారు. స్పెషల్ జడ్జి ఎంకె నాగ్‌పాల్ ఈమేరకు వీరికి అవకాశం కల్పించారు.