ఎన్నికల్లో పోస్టర్లు, హామీలు ఏమీ ఉండవు

వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి పోస్టర్లు లేదా బ్యానర్లు వేయకూడదని నిర్ణయించుకున్నానని, అలాగే ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయనని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజలకు సేవ చేశానని చెబుతూ నచ్చితే నాకు ఓటు వేయాలని ఆయన కోరారు. 
 
మహారాష్ట్రలోని వాషిమ్‌లో శనివారం ఓ కొత్త రహదారిని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో గడ్కరీ మాట్లాడుతూ ‘నేను మీకు సేవ చేశాను. మీకు నచ్చితే నాకు ఓటు వేయండి.. మీకు ఇష్టం లేకపోతే వద్దు’ అని స్పష్టం చేశారు.  `నేను ఓటర్లకు తాయిలాలు ఇవ్వను.. అవినీతికి పాల్పడను లేదా వారిని దానిలో మునిగిపోనివ్వను’ అని చెప్పారు. 
 
‘వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి బ్యానర్లు లేదా పోస్టర్లు వేయించకూడదని నిర్ణయించుకున్నాను.. అలాగే, ఛాయ్ పానీ కూడా ఇవ్వకూడదని అనుకుంటున్నాను.. మీకు లక్ష్మీ దేవి దర్శనం ఉండదు (డబ్బులు పంచను అని చెప్పే ఒక వ్యావహారిక పద్ధతి).. స్వదేశీ లేదా విదేశీ మద్యం కూడా లభించదు. నేను అవినీతిలో కూరుకుపోను, మిమ్మల్ని కూడా అందులో మునిగిపోనివ్వను’ అని గడ్కరీ తెలిపారు.

కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి అయిన నితిన్ గడ్కరీ నాగ్‌పూర్ పార్లమెంట్ సీటు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జాతీయ రహదారులపై ఏడాది నాటికి గుంతలు లేకుండా చూసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని ఆయన ప్రకటించారు. బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (బీఓటీ) మోడల్‌ను ఉపయోగించి రోడ్ల నిర్మాణాన్ని చేపట్టడానికి మంత్రిత్వ శాఖ ప్రాధాన్యతనిస్తోందని, అలాంటి ప్రాజెక్టులు మెరుగ్గా నిర్వహించబడుతున్నాయని ఆయన చెప్పారు.

సాధారణంగా రహదారి నిర్మాణంలో  బీఓటీ,ఇంజనీరింగ్ భూ సేకరణ అండ్ నిర్మాణం (ఈపీసీ), హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఎం) వంటి మూడు నమూనాలను ఉపయోగిస్తారు. ‘ఈపీసీ మోడ్‌లో నిర్మించిన రహదారులకు చాలా ముందుగానే నిర్వహణ అవసరమవుతుంది.. అయితే బీఓటీ మోడ్‌లో రాబోయే 15-20 సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చులు భరించాల్సి ఉంటుందని కాంట్రాక్టర్లకు తెలుసు కాబట్టి పనులు నాణ్యంగా జరుగుతాయి’ అని గడ్కరీ పేర్కొన్నారు.