భారత్‌లో దౌత్య కార్యకలాపాలను నిలిపివేస్తున్న ఆఫ్ఘన్

భారత్‌లో దౌత్యపరమైన కార్యకలాపాలను ఇక నిలిపివేస్తున్నామని అఫ్గనిస్థాన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. భారత ప్రభుత్వం నుంచి తమకు ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోవడంతో న్యూఢిల్లీలోని తమ రాయబార కార్యాలయాన్ని ఆదివారం (అక్టోబర్‌ 1) నుంచి మూసివేయనున్నామని తాలిబన్‌ ప్రభుత్వం తెలిపింది. 
 
దీనిపట్ల తాము చింతిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు శనివారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. భారత్‌, అఫ్ఘానిస్థాన్‌ మధ్య ఉన్న చారిత్రక ద్వైపాక్షిక సంబంధాలను, అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే తమ దౌత్యపరమైన కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించామని వెల్లడించింది. 
 
అంతేకాదు, తమ దేశం పట్ల భారత్‌ ఆసక్తిని చూపడం లేదని, వివిధ కారణాలతో తమ రాయబార కార్యాలయంలో సిబ్బంది, ఇతర వనరులను భారత్‌ తగ్గించిందని తాలిబన్లు ఆరోపించారు. వనరుల లేమితో కార్యకలాపాలను కొనసాగించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మరో మార్గం లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.  అధికారాన్ని భారత్‌కు అప్పగించే వరకు అఫ్ఘాన్‌ పౌరులకు అత్యవసర కౌన్సిలర్‌ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
‘భారత్‌లో దౌత్యపరమైన మద్దతు కొరవడటం.. అఫ్గన్‌లో చట్టబద్ధంగా పనిచేసే ప్రభుత్వం లేకపోవడం వల్ల తమ పౌరుల అవసరాలు, ఉత్తమ ప్రయోజనాలను అందించడంలో లోపాలను మేము గుర్తించాం’ అని పేర్కొంది. దౌత్యవేత్తలకు ఇతర కీలకమైన సహకార రంగాలకు వీసా పునరుద్ధరణ నుంచి సకాలంలో తగినంత మద్దతు లేకపోవడం మా బృందంలో నిరాశకు దారితీసింది.. సాధారణ విధులను సమర్థవంతంగా నిర్వహించే మా సామర్థ్యానికి ఆటంకం కలిగించింది’ అని ప్రకటన పేర్కొంది.
దౌత్య సంబంధాలపై వియన్నా కన్వెన్షన్ (1961)లోని ఆర్టికల్ 45 ప్రకారం రాయబార కార్యాలయం ఆస్తి, సౌకర్యాలు ఆతిథ్య దేశ సంరక్షక అధికారానికి బదిలీ చేస్తారు.  కాగా, భారత్‌లో ప్రస్తుతం ఆ దేశ రాయబారిగా ఫరీద్‌ మముంద్‌జాయ్‌ వ్యవహరిస్తున్నారు. తాలిబన్లు అఫ్ఘానిస్థాన్‌ను ఆక్రమించకముందు అష్రఫ్‌ ఘనీ ప్రభుత్వం ఆయనను నియమించింది. 2021, ఆగస్టులో అఫ్ఘాన్‌ తాలిబన్ల పాలనలోకి వెళ్లిన విషయం తెలిసిందే.
భారత్‌లో అఫ్గాన్‌ రాయబార కార్యాలయంలో ట్రేడ్‌ కౌన్సిలర్‌గా వ్యవహరిస్తోన్న ఖాదిర్‌ షా కొన్ని నెలల కిందట రాయబార కార్యాలయానికి తానే ఇంఛార్జ్‌ని అని భారత విదేశాంగ శాఖకు లేఖ రాశారు. అఫ్గన్‌లో తాలిబన్ల ప్రభుత్వాన్ని భారత్‌ సహా ప్రపంచ దేశాలు గుర్తించలేదు. ఈ క్రమంలోనే ఆ దేశ రాయబార కార్యాలయానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. దీంతో తమ పట్ల భారత్‌ నిర్లక్ష్యం వహిస్తుందంటూ ఆఫ్గాన్‌ తన కార్యకలాపాలను నిలిపివేసింది. ఇదే సమయంలో అఫ్గన్‌లో మహిళలపై ఆంక్షల పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.