పాకిస్థాన్‌ను మరోసారి చిత్తు చేసిన భారత్

చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలలో భాగంగా పూల్-ఏలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత పరుషుల హాకీ జట్టు 10-2 తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌ ఆద్యాంతం భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ముఖ్యంగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ చెలరేగిపోయాడు. పాకి డిఫెన్స్‌ను దాటి 4 గోల్స్ చేశాడు.

భారత్ తరఫున మందీప్ మ్యాచ్ ప్రారంభమైన 8వ నిమిషానికే గోల్ చేసి ఖాతా తెరిచాడు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 11, 17వ నిమిషాల వద్ద గోల్ చేయగా.. సుమిత్ 30 నిమిషాల వద్ద మరో గోల్ చేశాడు. అనంతరం 33, 34 నిమిషాల వద్ద కెప్టెన్ మరో రెండు గోల్స్ చేశాడు. దీంతో భారత్ 6-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 
పాక్ తరఫున ఎంఎస్ ఖాన్ 38వ నిమిషానికి తొలి గోల్ చేశాడు. వెంటనే వరుణ్ గోల్ కొట్టి ఆధిక్యాన్ని మరింత పెంచాడు. 45వ నిమిషం వద్ద పాకిస్థాన్ మరో గోల్ చేసింది. ఇక అదే ఆ జట్టుకు ఈ మ్యాచ్‌లో చివరి గోల్. తర్వాత సంశీర్ 46వ నిమిషం, ఉపాధ్యాయ్ 49వ నిమిషం వరుణ్ 54వ నిమిషం వద్ద గోల్ చేశాడు. 
 
దీంతో భారత్ ఆట ముగిసే సమయానికి 10-2తో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టింది. అక్టోబర్ 4న సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే అంతకుముందు పూల్ ఏలో అక్టోబర్ 2న బంగ్లాదేశ్‌తో తలపడాల్సి ఉంది.
 
ఇక ఇప్పటివరకు భారత పురుషుల హాకీ టీమ్ 4 మ్యాచులు ఆడగా.. మొత్తంగా 46 గోల్స్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో 8 గోల్స్ తేడాతో గెలిచిన భారత్ పలు రికార్డులు నమోదు చేసింది. పురుషుల హాకీలో పాకిస్థాన్‌ను అత్యధిక గోల్స్ తేడాతో (8) ఓడించింది. అంతకుముందు భారత్ 2017లో 7-1 తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.