ఏపీలో 2 వేల రైతు భరోసా కేంద్రాల ఎత్తివేత!

ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మానస పుత్రికలు’గా ప్రచారం చేసుకొంటున్న రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె) తగ్గింపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 2000 వరకు ఆర్‌బికెలను రద్దు పర్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఆర్‌బికెల కోసం నియమితులైన అదనపు సిబ్బందిని వేరే కార్యక్రమాలకు తరలించాలని, అవసరమైన చోట సర్దుబాటు చేయాలని వ్యవసాయశాఖ కమిషనరేట్‌ నుంచి కిందికి ఉత్తర్వులు వెళ్లాయి.

రేషనలైజేషన్‌ (హేతుబద్ధీకరణ) పేరుతో నెలకొల్పిన వేల ఆర్‌బికెలను ఎత్తేయడం వలన ఇప్పటి వరకు వాటిలో ఏర్పాటు చేసిన మౌలిక వసతులకు, స్వంత భవనాల నిర్మాణాలకు సర్కారు ఖర్చు చేసిన కోట్లాది రూపాయలు వృథా అవుతున్నాయి. ఆర్‌బికెల కోసం కొత్తగా నియమించిన విలేజి అగ్రికల్చర్‌/ హార్టికల్చర్‌/ సెరికల్చర్‌ అసిస్టెంట్ల భవితవ్యం ప్రశ్నార్ధకమైంది. 

విత్తు నుంచి పంటల విక్రయం వరకు వ్యవసాయదారుల అన్ని లావాదేవీలు, ప్రభుత్వ పథకాలు గ్రామాల్లో రైతుల చెంతనేనని వైసిపి ప్రభుత్వం 2020 మేలో ఆర్‌బికెల వ్యవస్థ తీసుకొచ్చింది. ప్రతి గ్రామ సచివాలయానికి అనుబంధంగా ఆర్‌బికె అని చెప్పింది. ఎపి వ్యాప్తంగా 10,778 సెంటర్లను నెలకొల్పింది. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. 

మూడేళ్ల అనంతరం ఇప్పుడు ఆర్‌బికెల రేషనలైజేషన్‌ అంటూ వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ మార్గదర్శకాలు జారీ చేశారు. సెప్టెంబర్‌ 15 లోపు ప్రక్రియ పూర్తి కావాలన్నారు.  గతంలో ఒక్కో సచివాలయం పరిధిలో ఒక ఆర్‌బికె ఉండగా రేషనలైజేషన్‌ అనంతరం రెండు మూడు సచివాలయాలకు ఒక ఆర్‌బికె అయింది. 

అర్బన్‌లో, సెమీ అర్బన్‌లో, పెద్ద గ్రామ పంచాయతీలలో ఎన్ని వార్డు సెక్రటేరియట్‌లు ఉన్నా ఒక్క ఆర్‌బికెకే పరిమితం చేశారు. ఉత్తర్వుల్లో ఒక ఆర్‌బికె పరిధిలో వెయ్యి-1,500 ఎకరాల విస్తీర్ణం ఉండాలని, ఏజెన్సీలో అయితే 600-800 ఎకరాలుగా పేర్కొనగా అందుకు విరుద్ధంగా అత్యధికంగా 3 వేల ఎకరాల వరకు, అతి తక్కువ 600 ఎకరాల కింద పరిధులు నిర్ణయించారు.

అన్ని హంగులతో ఆర్‌బికెలకు సొంత భవనాల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికి 10,243 భవనాల నిర్మాణం మొదలు పెట్టగా 1,500 వరకు పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. సగానికిపైన ఆర్‌బికెలు ఇప్పటికీ అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ప్రభుత్వం నెలల పర్యంతం అద్దెలు బకాయి పడింది. కాగా రేషనలైజేషన్‌లో సొంత భవనం ఉన్న ఆర్‌బికెలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 

ఎత్తేసే ఆర్‌బికెల కోసం చేపట్టిన నిర్మాణాలను ఏం చేస్తారనే ప్రశ్న వస్తోంది. అన్ని ఆర్‌బికెలలో కియోస్క్‌, టివి, కంప్యూటర్లు, విలువైన ఫర్నీచర్‌ వంటి మౌలిక వసతులకు కనీసం రూ.10 లక్షల వరకు వ్యయం చేశారని అంచనా. ఉన్నపళాన వేల ఆర్‌బికెలను ఎత్తేస్తే ఆ పరికరాల పరిస్థితేంటో అర్థం కాకుండా ఉంది. ఆర్‌బికెల కోసం 6,758 వివిఎలు ఉన్నారు.

హార్టికల్చర్‌ పంటలు అధికంగా ఉన్న చోట వివిహెచ్‌లు, సెరికల్చర్‌ ప్రాంతాల్లో విఎస్‌ఎలను నియమించారు. ఇంకా కొన్ని అర్‌బికెలలో సిబ్బంది లేరు. ఎఇఒలు, ఎంపిఇఒలను వేశారు. రేషనలైజేషన్‌లో అర్బన్‌ ఆర్‌బికెలలో తప్పనిసరిగా ఎఇఓలు, ఎంపిఇఓలనే వేయాలని నిబంధన పెట్టారు. అదనపు సిబ్బందిని అవసరాలకనుగుణంగా సర్దుబాటు చేయమన్నారు.