డిసెంబర్ నాటికి గుంతలు లేని జాతీయ రహదారులు

ఈ ఏడాది డిసెంబర్ నాటికి జాతీయ రహదారులను గుంతలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. హైవేలు గుంతలు లేకుండా ఉండేలా తమ మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టిందని వెల్లడించారు.  కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో 1.46లక్షల మేర జాతీయ రహదారి నెట్​వర్క్​ ఉంది. ఈ ఏడాది డిసెంబర్​ నాటికి రహదారులపై గొయ్యి సమస్య ఉండదని ఉండదని స్పష్టం చేస్తూ,  ఈ మేరకు షార్ట్​ టర్మ్​ కాంట్రాక్ట్స్​ ఇస్తున్నట్టు తెలిపారు.

“దేశ జాతీయ రహదారులపై ఎలాంటి గొయ్యిలు ఉండకుండా చూసుకునేందుకు కేంద్రం ఓ విధానాన్ని రూపొందిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ రహదారుల నెట్​వర్క్ భారత్ సొంతం. కాంట్రక్టర్స్​ సాయంతో ఈ నెట్​వర్క్​ను ఎన్​హెచ్​ఏఐ (నేషనల్​ హైవే అథారిటీ ఆఫ్​ ఇండియా) నిర్మిస్తుంది, నిర్వహిస్తుంది,” అని నితిన్​ గడ్కరీ వివరించారు. పనితీరు ఆధారిత నిర్వహణ, స్వల్పకాలిక నిర్వహణ ఒప్పందాలను పటిష్టం చేస్తోందని ఆయన చెప్పారు. 

రహదారులపై గుంతలు రోడ్ల నిర్మాణంలో ఉపయోగించే పద్ధతి బట్టి ఉంటాయి. మనదేశంలో రహదారులను మూడు పద్ధతుల్లో నిర్మిస్తున్నారు. బీఓటీ (బిల్ట్​-ఆపరేట్​- ట్రాన్స్​ఫర్​), ఈపీసీ (ప్రొక్యూర్మెంట్​ అండ్​ కన్​స్ట్రక్షన్​), హెచ్​ఏఎం (హైబ్రీడ్​ యాన్యుటీ మోడల్​). ఈపీసీ మార్గంలో రూపొందించిన రహదారులను కేంద్రం నిర్వహిస్తుంది. ఈ రహదారుల వినియోగదారుల నుండి టోల్​ను వసూలు చేస్తుంది.

బిల్ట్-ఆపరేట్-ట్రాన్స్‌ ఫర్ (బీవోటీ) పద్ధతిలో రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. అటువంటి ప్రాజెక్టులు రోడ్లను మెరుగైన పద్ధతిలో నిర్వహిస్తున్నాయని చెప్పారు. “బీఓటీ రోడ్లు చాలా పర్ఫెక్ట్​గా ఉంటాయి. వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈపీసీ మార్గంలో రూపొందించే రోడ్లను ఎప్పటికప్పుడు మెయిన్​టైన్​ చేస్తూ ఉండాలి. అందుకే వీటి నిర్వహణ కోసం షార్ట్​ టర్మ్​ కాంట్రాక్ట్స్​ ఇవ్వాలని చూస్తున్నాము,” అని నితిన్​ గడ్కరీ పేర్కొన్నారు.

వర్షాల వల్ల హైవేలు దెబ్బతిని, గుంతలు ఏర్పడుతాయని పేర్కొంటూ దీన్ని అరికట్టేందుకు కొత్త విధానాన్ని పరిశీలిస్తామని మంత్రి చెప్పారు. జాతీయ రహదారుల వెంబడి డ్రైనేజీ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని, వాటిని కూడా పరిష్కరించేందుకు కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు గడ్కరీ తెలిపారు.

ఈ ప్రక్రియలో భాగంగా.. ఇప్పటికే భారత దేశ జాతీయ రహదారుల మ్యాపింగ్​ ప్రక్రియ పూర్తయిందని చెబుతూ వాటి నిర్వహణ కోసం ఇంజినీర్లను తీసుకుంటున్నట్టు వెల్లడించారు. మరోవైపు మున్సిపల్ వ్యర్థాలను రోడ్ల నిర్మాణంలో ఉపయోగించేందుకు ప్రభుత్వం మరో జాతీయ విధానాన్ని కూడా రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంలో వాటాదారులందరితో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. 

వ్యర్థాలు దేశానికి పెద్ద సమస్య అని, ఇలాంటి విధానాన్ని అమలు చేస్తే దేశానికి ప్రయోజనం చేకూరుతుందని గడ్కరీ పేర్కొన్నారు. 2070 నాటికి సున్నా వ్యర్థాలు (నెట్ జీరో) అనే ప్రధానమంత్రి దార్శనికతను సాధించేందుకు ఈ విధానం భారత్‌కు దోహదపడుతుందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.