
సుమారు 375 ఏండ్ల తర్వాత పరిశోధకులు కొత్త ఖండాన్ని కనుగొన్నారు. 2017లోనే వెలుగులోకి వచ్చిన ఈ ఖండం ఉనికిని తాజాగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆక్లాండ్లో ఉన్న న్యూజిలాండ్ క్రౌన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ జీఎన్ఎస్ సైన్స్ పరిశోధకులు ఈ మేరకు కొత్త ఖండం మ్యాప్ను విడుదల చేశారు. దీంతో ఇప్పటికే ఉనికిలో ఉన్న ఏడు ఖండాలకు తోడు కొత్తగా జిలాండియా వచ్చి చేరింది.
దీంతో మొత్తం ఖండాల సంఖ్య ఎనిమిదికి చేరే ఆస్కారం ఉంది. అతి ప్రాచీన ఖండం గోండ్వానాలో భాగమైన జిలాండియా కాలక్రమేణా వేరుపడినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ఖండం మొత్తం విస్తీర్ణం 4.9 మిలియన్ చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణంలో ఇది మడగాస్కర్కు ఆరు రెట్లు ఉంటుంది. పసిఫిక్ మహా సముద్రంలో 2 కిలోమీటర్ల లోతులో ఉన్న ఈ ఖండం సుమారుగా 94 శాతం నీటిలోనే ఉంది. మిగతా ప్రాంతం చిన్నచిన్న దీవులతో న్యూజిలాండ్ మాదిరిగా ఉంది.
డచ్ సెయిలర్ అబెల్ టాన్మాన్ 1642లో మొదటిసారిగా జిలాండియా గురించి ప్రపంచానికి తెలియజేశారు. అయితే ఆయన సరైన ఆధారాలను సమర్పించలేకపోయారు. 375 ఏండ్ల తర్వాత జీఎన్ఎస్ పరిశోధకులు జిలాండియా ఉనికిని నిర్ధారించారు. అక్కడ లభ్యమైన రాళ్లు, అవక్షేప నమూనాలపై పరీక్షలు చేసి కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఖండం గోండ్వానా నుంచి ఎందుకు వేరుపడిందో శాస్త్రవేత్తలకు అంతుచిక్కలేదు.
More Stories
విద్యార్థుల వీసాల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్
పోప్ అంత్యక్రియలకు ముర్ము, ట్రంప్ సహా 2 లక్షల మంది హాజరు
పహల్గాం దాడిని ఖండించిన ఐరాస భద్రతా మండలి