సొంతంగా యుద్ధనౌక తయారుచేసుకున్న టైవాన్

తైవాన్‌ను ఆక్రమించుకోవాలని కలలు కంటూ బ్లూప్రింట్‌ను విడుదల చేసిన చైనాకు భారీ షాక్ తగిలింది. తైవాన్ సొంతంగా తయారు చేసిన తొలి జలాంతర్గామిని గురువారం ఆవిష్కరించింది. పోర్టు సిటీ ఖోషింగ్‌లో ఈ జలాంతర్గామిని అధ్యక్షురాలు త్సాయ్ యింగ్ వెస్ ఆవిష్కరించారు.

మరికొన్నేళ్లలో చైనా ఆక్రమిస్తుందని అమెరికా హెచ్చరికలు జారీ చేసిన సమయంలో తైవాన్ సొంతంగా ఆయుధాలు నిర్మించడం గమనార్హం. ఈ సందర్భంగా తైవాన్ అధ్యక్షురాలు త్సాయి మాట్లాడుతూ “చరిత్ర ఈ రోజును ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. గతంలో సొంతంగా జలాంతర్గామి నిర్మించడం దాదాపు అసాధ్యం. కానీ ఇప్పుడు దానిని సుసాధ్యం చేశాం. ” అని గర్వంగా ప్రకటించారు. 

దాదాపు 1.54 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఈ డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గామి ఆ దేశ నౌకాదళం చేతికి 2024 నాటికి అందుతుంది. ఈ కొత్త సబ్‌మెరైన్‌కు హైకూ అని పేరు పెట్టారు. మరో జలాంతర్గామి నిర్మాణ దశలో ఉంది. కనీసం 10 జలాంతర్గాములను నౌకాదళానికి అందించాలన్నది తైవాన్ లక్షంగా పెట్టుకొంది. 

గతవారం తైవాన్ సబ్‌మెరైన్ ప్రోగ్రామ్ అధిపతి అడ్మిరల్ హువాంగ్ సు కువాంగ్ మాట్లాడుతూ చైనా దాడి , నౌకాదళ బ్లాకేడ్‌ను అడ్డుకోవడమే తమ లక్షమని వెల్లడించారు. చైనా చేపట్టే హఠాత్తు దాడిని తట్టుకొని నిలబడటం తైవాన్‌కు కీలకం. కనీసం అమెరికా, జపాన్ దళాలు అక్కడకు వచ్చేవరకైనా అది చైనాను ఆపగలగాలలి. 

ఈ నేపథ్యంలో దాదాపు కొన్నేళ్ల నుంచి సొంతంగా సబ్‌మెరైన్ తయారు చేసుకోవాలని చూస్తోంది. కానీ, త్సాయి యింగ్‌వెన్ అధికారం లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు వేగవంతమైంది. ఆమె ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌ను దాదాపు రెట్టింపు చేశారు. ఇప్పటికే తైవాన్ చుట్టు పక్కల సముద్ర జలాల్లో చైనా యాంటీ సబ్‌మెరైన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తోంది. చైనా వద్ద దాదాపు 60 సబ్‌మెరైన్లు ఉన్నాయి.