నిజ్జర్ హత్య వెనుక పాక్ ఐఎస్‌ఐ?

భారత్ విషయంలో దొరికిన ప్రతీ అవకాశాన్ని తమకు అనుగుణంగా మార్చుకుని ఎప్పటికప్పుడు విషం చిమ్మే దాయాది దేశం పాకిస్థాన్ గురించి తాజాగా సంచలన విషయం వెల్లడైంది. ప్రస్తుతం భారత్, కెనడాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలకు కారణం పాకిస్తాన్ అని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.  నిజ్జర్‌ను హత్య చేసి అది భారత్‌పైకి తోసి భారత్, కెనడాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని తీసుకువచ్చేందుకు కుట్ర పన్నినట్లు స్పష్టం అవుతుంది.
దీంతోపాటు నిజ్జర్‌తో తమకు ఉన్న సంబంధాలను నిజ్జర్ తన సొంత ప్రయోజనాలకు వాడుకోవడంతో అతడ్ని హత్య చేయడం ద్వారా అటు నిజ్జర్‌తోపాటు భారత్‌పై ఒకేసారి పగ తీర్చుకోవాలని ఈ హత్య చేసినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  భారత్‌- కెనడా మధ్య దౌత్యపరమైన చిచ్చు రేగడానికి దారి తీసిన ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఈమేరకు నిఘా వర్గాల సమాచారాన్ని ఉదహరిస్తూ అనేక జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య ఆ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ వర్గాల తాజా రిపోర్ట్ సంచలనంగా మారింది. భారత్, కెనడాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడానికి పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్ర చేసిందని ఆ నివేదిక పేర్కొంది. దీని కోసం చాలా నెలల క్రితం నుంచే నిజ్జర్ హత్యకు ప్లాన్ వేసినట్లు తెలిపింది.

ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ నిజ్జర్‌కు కెనడాలో ఉంటున్న పాక్ ఐఎస్‌ఐ నిఘా ఏజెంట్లతో సంబంధాలున్నాయి. కెనడాకు వచ్చే తమ గ్యాంగ్‌స్టర్లకు పూర్తి మద్దతు ఇవ్వాలని ఐఎస్‌ఐ గత కొన్నేళ్లుగా నిజ్జర్‌పై ఒత్తిడి పెంచుతోంది. కానీ అతడు మాత్రం ఖలిస్థానీ నేతలకు అనుకూలంగా పనిచేస్తున్నాడు.  ఇక స్థానికంగా పాప్యులారిటీ పెంచుకున్న అతడు డ్రగ్స్ అక్రమ దందాను నియంత్రిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కక్ష పెంచుకున్న ఐఎస్‌ఐ, నిజ్జర్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. దీనికోసం ఇద్దరు ఏజెంట్లకు ఈ బాధ్యతను అప్పగించినట్టు నిఘా వర్గాల సమాచారం. 

ఇక కెనడాలో నిజ్జర్ ఉంటున్న ప్రాంతానికి చుట్టుపక్కల ఐఎస్‌ఐ మాజీ అధికారులు నివసిస్తున్నట్టు తెలిసింది. వీరి ద్వారానే నిజ్జర్ కదలికలను తెలుసుకున్నట్టు సమాచారం. బ్రిటిష్ కొలంబియా లోని సర్రే స్రాంతంలో ఓ గురుద్వారా సాహిబ్ ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఏడాది జూన్‌లో నిజ్జర్‌ను కాల్చి చంపారు.