* ఢిల్లీ, పంజాబ్ లలో ఉగ్రదాడుల అవకాశాలపై అప్రమత్తం
కెనడా వ్యవహారంతో దేశంలో భద్రతా సంస్థలు ఖలిస్థానీ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులపై దాడులకు పాల్పడే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్యాంగ్స్టర్ల నెట్ వర్క్ను ఛేదించేందుకు పంజాబ్ పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు చర్యలు ముమ్మరం చేశాయి.
కెనడా ఎపిసోడ్ తర్వాత పంజాబ్లో పంజాబ్లోని గ్యాంగ్స్టర్లు, ఉగ్రవాదులు, వారి సహాయకుల రహస్య స్థావరాలపై దాడులు జరుపుతున్నారు. ఈ ఆపరేషన్లో పంజాబ్ పోలీసులతో పాటు, ఎన్ఐఏ సహా కేంద్ర ఏజెన్సీలు పాల్గొంటున్నారు. ఉగ్రవాదులకు సంబంధించిన పలు కీలకపాత్రలు సైతం లభ్యమయ్యాయి. దాదాపు 30 మందిని అదుపులోకి తీసుకొని యాంటీ గ్యాంగ్స్టర్ టాస్క్ ఫోర్స్ (ఏజీటీఎఫ్) వారిని విచారిస్తోంది.
గత 48 గంటల్లో గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్, అతని సహాయకులు, గ్యాంగ్స్టర్లు రహస్య స్థావాలపై దాడులు జరిపారు. విదేశాల్లో దాక్కు ఉగ్రవాదులకు, గ్యాంగ్స్టర్లు ఏదో విధంగా సహాయం అందిస్తున్నారు. అలాంటి వారి రికార్డులను పోలీసులు సేకరించారు. గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ కెనడా నుంచి తన నెట్వర్క్ని నడుపుతున్నాడు. కరోనా సమయంలో ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లకు సోషల్ మీడియా ద్వారా పంజాబ్ యువతను మచ్చిక చేసుకొని వారిని తన నెట్వర్క్తో కనెక్ట్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
కెనడాలో ఉన్న ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లు మైనర్లు, కళాశాలలు, యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులను నమ్మించి మోసం చేస్తున్నారు. కొంత మంది ఖాతాల్లో డబ్బులు జమ చేసి వారిని పావులుగా వాడుకుంటూ పంజాబ్లో వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్పిజి)తో టార్న్ తరణ్ సర్హాలి పోలీస్స్టేషన్పై జరిగిన దాడిలో ఉగ్రకోణం బయటపడింది. పదిమంది మైనర్లతో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డట్లుగా గుర్తించారు. ప్రస్తుతం విదేశాల్లో నక్కిన ఖలిస్థానీ ఉగ్రవాదుల ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
50కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు
ప్రమాదకరంగా మారిన దేశంలో ఖలిస్థానీలు- గ్యాంగ్స్టర్ల మధ్య బంధంను కట్టడి చేయడంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దృష్టి సారించింది. ఈ బంధానికి చెక్ పెట్టేందుకు బుధవారం పంజాబ్, హర్యానా, ఢిల్లీ-ఎన్సీఆర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 50కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు.
ఖలిస్థాన్ ఉగ్రవాదులు ఇక్కడి గ్యాంగ్స్టర్లకు నిధులు సమకూర్చడం, ఆయుధాలు సరఫరా చేయడం ద్వారా విదేశీ నేల నుంచి దేశ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే పంజాబ్లోని 30, రాజస్థాన్లో 13, హర్యానాలో నాలుగు, ఉత్తరాఖండ్లోని రెండు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలోని వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం ఉదయాన్నే ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహించారు.
కెనడా, భారత్ మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొని ఉన్న నేపథ్యంలో విదేశాల్లో దాక్కున్న ఉగ్రవాదుల కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఉచ్చు బిగిస్తున్నది. కెనడా, యూకే, అమెరికా, దుబాయిలలో తలదాచుకున్న 19 మంది ఖలిస్తాన్ ఉగ్రవాదుల జాబితాను సిద్ధం చేశారు. పాత కేసుల్లోనూ వారి ఆస్తులను జప్తు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.
ఇందు కోసం ఎన్ఐఏ బృందాలను కేసులను అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ జాబితాలో పేర్లున్న వ్యక్తులందరూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. పరంజీత్ సింగ్ పమ్మా, వాధావా సింగ్ బబ్బర్ అలియాస్ చాచా, కుల్వంత్ సింగ్, జేఎస్ ధలీవాల్, సుఖ్పాల్ సింగ్, హర్ప్రీత్ సింగ్ అలియాస్ రాణా, సరబ్జిత్ సింగ్, కుల్వంత్ సింగ్ అలియాస్ కాంత, హర్జాప్ సింగ్ అలియాస్ జప్పీ సింగ్, రంజీత్ సింగ్ నీతా, అలీ గుర్మీత్ పరారీలో ఉన్నవారి జాబితాలో ఉన్నారు.
అలియాస్ బాబా, గురుప్రీత్ సింగ్ అలియాస్ బాగీ, జస్మీత్ సింగ్ హకీంజాదా, గుర్జంత్ సింగ్ ధిల్లాన్, లఖ్బీర్ సింగ్ రోడ్, అమర్దీప్ సింగ్ పూరేవాల్, జతీందర్ సింగ్ గ్రేవాల్, దపిందర్జిత్, ఎస్ హిమ్మత్ సింగ్ పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. శనివారం ఎన్ఐఏ నిషేధిత సంస్థ సిక్కు ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను చండీగఢ్, అమృత్సర్లోని ఆస్తులను స్వాధీనం చేసుకుంది. దీనికి ముందు ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ఆస్తులను జప్తు చేసే ప్రక్రియ ప్రారంభించింది.
పాకిస్థాన్లో తలదాచుకున్న ఉగ్రవాది కరణ్వీర్ సింగ్పై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయగా, ఇంటర్ పోల్ సైతం ఖలిస్తానీ ఉగ్రవాదులపై చర్యలు ప్రారంభించింది. కరణ్వీర్ వాస్తవానికి కపుర్తలా నివాసి. అతనిపై నేరపూరిత కుట్ర, హత్య, ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బు సేకరించడం, ఆయుధ చట్టం, ఉగ్రవాద ముఠా సంస్థలో సభ్యుడిగా కొనసాగుతున్నట్లుగా అభియోగాలు నమోదయ్యాయి.
పాకిస్థాన్లో తలదాచుకున్న హర్విందర్ సింగ్ రిండా, కెనడాలో తలదాచుకున్న లఖ్బీర్ సింగ్ లాండా మధ్య సత్సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. వీరిద్దరూ పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐలో పని చేస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే, హిందూ నేత హత్య, ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, దోపిడీ ఘటనల్లో వీరిద్దరి పాత్ర ఉన్నట్లు తేలింది.
అంతే కాకుండా పంజాబ్కు వ్యతిరేకంగా నేర కార్యకలాపాలు నిర్వహించడానికి లాండాకు ఐఎస్ఐ నిధులు సమకూరుస్తున్నది. పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్క్వార్టర్స్, టార్న్ తరణ్కి చెందిన సహరాలీ పోలీస్ స్టేషన్పై దాడిలో వారిద్దరి పాత్ర సైతం వెలుగులోకి వచ్చింది.
More Stories
చదువుల్ని లోకకల్యాణం కోసం ఉపయోగించాలి
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
మణిపూర్ లో 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్