పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను ఖాళీ చేయాలని, సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపాలని పాకిస్థాన్కు భారత్ పిలుపునిచ్చింది. ఐక్యరాజ్య సమితి (ఐరాస) సదస్సులో పాక్కు వ్యతిరేకంగా ఘాటుగా వ్యాఖ్యానించింది. అమెరికాలోని న్యూయర్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 78వ సదస్సులో పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాకర్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు.
ఈ నేపథ్యంలో యూఎన్లో భారత్ తొలి కార్యదర్శి అయిన పెటల్ గెహ్లాట్ మాట్లాడుతూ పాకిస్థాన్కు ఘాటుగా సమాధానమిచ్చారు. ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ చేసిన ఆరోపణలకు ప్రత్యుత్తరం ఇచ్చేందుకు గల తన హక్కును భారత్ వినియోగించుకుంటూ భారత్ కు వ్యతిరేకంగా ప్రచారానికి అంతర్జాతీయ వేదికలను పాకిస్తాన్ పదేపదే దుర్వినియోగం చేస్తుండటంపట్ల మండిపడింది. జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని, ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు పాకిస్థాన్కు ఎలాంటి అధికారం లేదని తేల్చిచెప్పింది.
“భారత్కు వ్యతిరేకంగా నిరాధారమైన, దురుద్దేశపూరితమైన ప్రచారానికి ఈ వేదికను దుర్వినియోగం చేసే విషయంలో పాకిస్తాన్ అలవాటు నేరంగా మారింది. మానవ హక్కులపై తన స్వంత అధ్వాన్నమైన రికార్డు నుండి అంతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చడానికి పాకిస్తాన్ అలా చేస్తుందని ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలకు, ఇతర బహుపాక్షిక సంస్థలకు బాగా తెలుసు” అంటూ ఆమె మండిపడ్డారు.
“జమ్మూ కాశ్మీర్లోని కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని మేము పునరుద్ఘాటిస్తున్నాము. జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన విషయాలు పూర్తిగా భారతదేశ అంతర్గతమైనవి. మా ఆంతరంగిక విషయాలపై వ్యాఖ్యానించడానికి పాకిస్తాన్కు ఎటువంటి అధికారం లేదు” అని ఆమె స్పష్టం చేశారు.
“దక్షిణాసియాలో శాంతి నెలకొనాలంటే పాకిస్థాన్ తీసుకోవలసిన చర్యలు మూడు రెట్లు ఉంటాయి. ముందుగా, సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టండి. ఉగ్రవాదంకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను వెంటనే మూసివేయండి. రెండవది, తన చట్టవిరుద్ధమైన, బలవంతపు ఆక్రమణలో ఉన్న భారత భూభాగాలను ఖాళీ చేయండి. మూడవది, పాకిస్థాన్లోని మైనారిటీలపై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను అరికట్టండి” అని గహ్లోత్ నేరుగా పాకిస్తాన్ ను నిలదీశారు.
2008 ముంబై ఉగ్రవాద దాడులకు పాల్పడిన వారిపై పాకిస్తాన్ “సాంకేతిక వితండవాదానికి” బదులుగా విశ్వసనీయమైన, ధృవీకరించదగిన చర్య తీసుకోవాలని భారత దౌత్యవేత్త డిమాండ్ చేశారు. ఆ దేశంలోని మైనారిటీ వర్గాలపై దాడులకు సంబంధించిన దారుణ ఉదంతాలను ఈ సందర్భంగా గహ్లోట్ ప్రస్తావించారు.
More Stories
ఉక్రెయిన్ పై రష్యా రసాయన ఆయుధాల ప్రయోగం!
విదేశీ విద్యార్థులకు కెనడా వారానికి 24 గంటలే వర్క్ పర్మిట్
ఆఫ్ఘన్ షియా మసీదులో కాల్పులు.. ఆరుగురు మృతి