11 రాష్ట్రాల మీదుగా 9 వందేభారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ సెమీ-హైస్పీడ్ రైళ్లను దేశవ్యాప్తంగా పట్టాలేక్కిస్తోంది. ప్రస్తుతం దేశంలో 25 వందేభారత్ రైళ్లు నడుస్తుండగా, తాజాగా, మరో 9 రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఈ రైళ్లను ఆదివారం ప్రారంభించారు. 
 
మొత్తం 11 రాష్ట్రాలను ఈ రైళ్లు అనుసందించనున్నాయి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవి ఉండటం విశేషం. కాచిగూడ- యశ్వంత్‌పూర్‌, విజయవాడ-చెన్నై మధ్య ఈ రైళ్లు సేవలందించనున్నాయి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్, బిహార్, ఝార్ఖండ్, గుజరాత్‌లలోని నగరాల మధ్య ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి. 
 
చెన్నై-తిరునల్వేలి మధ్య ప్రతి రోజూ ఉదయం 6.00 గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 1. 50 గంటలకు చేరుకుని… మళ్లీ అక్కడ నుంచి 2.50 గంటలకు తిరుగు ప్రయాణమవుతుంది. తిరిగి చెన్నై నగరానికి రాత్రి 10.40 గంటలకు చేరుతుంది.  పట్నా-హౌర వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉదయం 8.00 గంటలకు హౌరాలో బయలుదేరి మధ్యాహ్నం 2.35 గంటలకు హౌరాకు చేరుకుంటుంది.

 అక్కడ నుంచి తిరిగి 3.50 గంటలకు హౌరా నుంచి తిరుగు ప్రయాణమై రాత్రి 10.40 గంటలకు పట్నా చేరుకోనుంది. చెన్నై సెంట్రల్- విజయవాడ వందేభారత్ రైలు ఉదయం 5.30 గంటలకు చెన్నైలో బయలుదేరుతుంది. విజయవాడకు రూ.12.10కి చేరుకుని, 3.20 గంటలకు తిరుగు ప్రయాణమవుతుంది. రాత్రి 10.00 గంటలకు చెన్నై చేరేలా షెడ్యూల్ రూపొందించారు.

సికింద్రాబాద్- బెంగళూరు వందేభారత్ రైల ఉదయం 5.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.00 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. అక్కడ నుంచి మళ్లీ మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు కాచిగూడకు చేరుకోనుంది.

ఒడిశాలోని రూర్కెల్- పూరీ, కేరళలో కాసర్‌గోడ్- తిరువనంతపురం, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్-జైపూర్, గుజరాత్‌లోని జామ్‌నగర్- అహ్మదాబాద్, ఝార్ఖండ్ రాజధాని రాంచీ- హౌరా (బెంగాల్) మధ్య కొత్తగా వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. తొలి కాషాయ వర్ణం వందేభారత్ రైలును కాసర్‌గోడ్- తిరువనంతపురం మధ్య నడిచింది.

కాచిగూడలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి జెండా ఊపి వందే భారత్‌ రైలును ప్రారంభించారు. కాగా, విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ  వందే భారత్‌ రైళ్లకు ఆదరణ పెరుగుతోందని తెలిపారు. రైల్వేల ఆధునికీకరణపై గత ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.

‘పేద, మధ్య తరగతి ప్రజలకు అత్యంత అనుకూలమైన ప్రయాణం సాధనం రైళ్లు. 140 కోట్ల మంది భారతీయుల ఆశలకు అనుగుణంగా భారీ స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం.. వందే భారత్‌ రైళ్లకు ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే 1.11 కోట్ల మంది ప్రయాణికులు వీటిలో ప్రయాణించారు’ అని ప్రధాని తెలిపారు. 
 
ప్రస్తుతం 25 వందే భారత్‌ రైళ్లు నడుస్తుండగా, మరో తొమ్మిది కొత్తగా చేరాయి. దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించే రోజు ఎంతో దూరంలో లేదు. సరికొత్త భారత్‌ విజయాలను చూసి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడని ప్రధాని మోదీ వివరించారు.
 
చంద్రయాన్‌-3 విజయవంతంతో సామాన్యుడి అంచనాలు కూడా పెరిగాయని, మహిళల సారథ్యంలో దేశంలో జరుగుతోన్న అభివృద్ధిని యావత్‌ ప్రపంచం ప్రశంసిస్తోందని ప్రధాని చెప్పారు. ఈ క్రమంలోనే మహిళా రిజర్వేషన్లను తీసుకువచ్చామని గుర్తు చేశారు. రైల్వేల ఆధునికీకరణపై గత ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడం దురదృష్టకరమని ప్రధాని మోదీ తెలిపారు.