ఎసిబి న్యాయ‌మూర్తిపై ట్రోలింగ్ …విచార‌ణ‌కు ఆదేశించిన రాష్ట్ర‌ప‌తి

విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సత్య వెంకట హిమబిందుపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. సోషల్ మీడియాలో జడ్జిని కించపరిచేలా పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పీసీ మీనా ఆదేశాలు జారీ చేశారు. 
ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  జవహర్‌ రెడ్డికి లేఖ రాశారు. 
రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబును ఎపి సిఐడి అధికారులు విచారిస్తున్న వేళ ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.  చంద్రబాబు నిందితుడిగా ఉన్న ‘స్కిల్ స్కాం’ కేసును ఏసీబీ కోర్టు జస్టిస్ హిమబిందు విచారిస్తున్నారు.  ఈ కేసులో చంద్రబాబును రిమాండ్ కు పంపిస్తూ న్యాయమూర్తి హిమబిందు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో జడ్జి హిమబిందును కించపరిచేలా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.  చంద్రబాబు కేసులో భాగంగా అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి హిమబిందుపై సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రచారంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అడ్వకేట్‌ రామానుజరావు ఈ-మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. 
 
కాగా, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబును రిమాండ్‌కు పంపించిన తర్వాత హిమబిందు వ్యక్తిగత జీవితంపై టిడిపి నేతలు వివాదాస్పదంగా వ్యవహరించారనీ, హిమబిందు వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని రామానుజరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం ఏపీ సీఎస్ కు శనివారం లేఖ రాసింది. జడ్జిపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుడు రామానుజానికి వివరించాలని పీసీ మీనా సూచించారు.