వైద్య విద్యార్థులు ఇకపై విదేశాల్లో కూడా ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు

భారతీయ వైద్య విద్యార్థులు ఇకపై విదేశాల్లో కూడా ప్రాక్టీస్‌ చేసుకొనేందుకు ప్రపంచ వైద్య విద్య సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఎంఈ) జాతీయ వైద్య మండలి (ఎంఎంసి)కి పదేళ్ల పాటు గుర్తింపు లభించిందని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో భారత్‌లో మెడిసిన్ చదివిన అభ్యర్థులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలతో పాటు న్యూజిలాండ్‌లలో పీజీ కోర్సుల్లో చేరడానికి, ప్రాక్టీస్‌ చేసుకోడానికి అవకాశం కలిగిందని వెల్లడించింది.
 
2024 నుంచి భారతీయ విద్యార్థులు విదేశాల్లో వైద్య విద్య, ప్రాక్టీస్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.  దేశంలోని ప్రస్తుతం ఉన్నవాటితో పాటు రాబోయే పదేళ్లలో ఏర్పాటయ్యే మెడికల్ కాలేజీలు డబ్ల్యూఎఫ్‌ఎమ్‌సిఈ గుర్తింపు పొందుతాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 706 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 
 
‘‘ఈ వెసులుబాటుతో భారతీయ మెడికల్ కాలేజీలు, నిపుణులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. విదేశాల్లోని మెడికల్ విద్యా సంస్థలు, భారత్‌లోని కాలేజీల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. వైద్య విద్యలో సరికొత్త ఆవిష్కరణలకు ఇది సహకరిస్తుంది” అని  మెడికల్ కౌన్సిల్ ప్రతినిధి డాక్టర్‌ యోగేందర్‌ మాలిక్‌ తెలిపారు.
 

భారత్‌లో అందించే వైద్య విద్య అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందనేందుకు డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపే నిదర్శనం అని చెప్పారు. దీని వల్ల భారతీయ వైద్య విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా తమ వృత్తిని కొనసాగించవచ్చని, అంతేకాకుండా, అంతర్జాతీయ విద్యార్థులను భారత వైద్య కళాశాలలు ఆకర్షిస్తాయని పేర్కొన్నారు.

అత్యున్నతస్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య విద్యను అందించేందుకు డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ కృషి చేస్తోంది. వైద్య విద్యలో ఆధునిక సాంకేతిక, నైతిక ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందజేయడానికి తోడ్పడుతుంది. ఈ అక్రిడేషన్ కోసం ప్రతి మెడికల్ కాలేజీ నుంచి 60 వేల డాలర్లు రుసుము వసూలు చేస్తోంది.  దీంతో దేశంలోని 706 వైద్య కళాశాలలు మొత్తంగా సుమారు 4,23,60,000 డాలర్లు డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈకి చెల్లించాల్సి ఉంటుంది.

అమెరికా విదేశీ మెడికల్ ఎడ్యుకేషన్ విద్యా కమిషన్ (ఈసిఎఫ్ఎంజి) అంతర్జాతీయ మెడికల్ గ్రాడ్యుయేట్‌లకు లైసెన్సు జారీ, నిబంధనలను పర్యవేక్షిస్తుంది. 
అంతర్జాతీయ వైద్య విద్యార్థులకు దీని ధ్రువీకరణ తప్పనిసరి. ఈ సర్టిఫికేషన్ సాధారణంగా మెడికల్ ప్రోగ్రామ్ రెండో ఏడాది పూర్తయిన తర్వాత, యూఎస్ఎంఎల్ఈ దశ 1 పరీక్షకు ముందు ఉంటుంది. 2010లో అమెరికా విద్యా కమిషన్ కొత్త నిబంధనలు తీసుకొచ్చి వీటిని 2023 నుంచి అమలుచేస్తామని తెలిపింది. 
 
కానీ, కరోనా కారణంగా వచ్చే ఏడాదికి దీనిని వాయిదా వేసింది. కొత్త నిబంధనల ప్రకారం ‘2024 నుంచి  ఈసిఎఫ్ఎంజి సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునేవారు గుర్తింపు పొందిన మెడికల్ కాలేజీ విద్యార్థి లేదా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ప్రత్యేకంగా వైద్య విద్య కోసం ప్రపంచ సమాఖ్య అధికారిక గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి’ అని తెలిపింది.