కేజ్రీవాల్ జైలులో సీఎంగా కొనసాగడంపై హైకోర్టు అసహనం

“ఓ వైపు ఢిల్లీ మున్సిపల్ సూళ్ల విద్యార్థులకు పుస్తకాల సమస్య ఉంది. మరో వైపు మీరు జైలులో ఉండి అధికారం చలాయిస్తామంటున్నారు. ఈ విధంగా అయితే తీవ్ర సమస్యలకు పరిష్కారం దక్కేది ఎప్పుడు?” అని ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్  కేజ్రీవాల్‌, ఆప్ ప్రభుత్వ ధోరణి పట్ల అసహనం వ్యక్తం చేసింది. 

వేలాదిగా పిల్లలు ఎంసిడి స్కూళ్లలో చదువుకుంటున్నారు. వీరికి పుస్తకాల సరఫరా నిర్ణయం ముఖ్యమంత్రి నుంచి కొన్ని అనుమతుల తరువాతనే వీలవుతుందని విద్యాశాఖాధికారులు కోర్టుకు తెలిపారు. అయితే కేజ్రీవాల్ మద్యం స్కామ్ కేసులో ఇప్పుడు తీహార్ జైలులో ఉన్నారు. ఇప్పటి వరకు జైలులో నుంచి కేజ్రీవాల్ పాలన సాగించే విషయంలో తాము మర్యాదపూర్వకంగానే వ్యవహరించామని పేర్కొంటూ  ఏదైనా జాతీయ ప్రయోజనాలు, జనం సమస్యలు కీలకమని చెపుతున్నామని కోర్టు స్పష్టం చేసింది.

అయితే ఇప్పుడు విద్యార్థుల పుస్తకాల విషయం తమ ముందుకు వచ్చినందున ఇక తాము ఈ విషయంలో ఏదో ఒకటి తేల్చాల్సి ఉందని, దీనిపై సోమవారం తమ నిర్ణయం ప్రకటిస్తామని, తగు ఆదేశాలు వెలువరిస్తామని యాక్టింగ్ చీఫ్ జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ పిఎస్ అరోరాతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ దశలో ఢిల్లీ ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ఉద్ధేశించి ‘ మీ క్లయింట్‌కు కేవలం అధికారం చలాయింపుపైనే దృష్టి ఉన్నట్లుంది’ అని వ్యాఖ్యానించింది.

ఒక్కరి అధికారం కోసం వేలాది మందిని గాలికి వదిలిపెడుతారా? మీరు ఇంకా ఎంతగా అధికారం అనుభవించాలనుకుంటున్నారు? అని ధర్మాసనం ప్రశ్నించింది. పరిపాలన స్తంభించిపోవాలంటే అది ముఖ్యమంత్రి వ్యక్తిగత నిర్ణయమా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. నాయకత్వం వహించే వ్యక్తులు “అందరినీ వెంట తీసుకెళ్లాలి” అని ధర్మాసనం పేర్కొంది.