ఉగ్రవాదులకు అడ్డాగా కెనడా.. భద్రత కోసమే వీసాలు బంద్

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య ప్రస్తుతం చెలరేగిన దుమారంపై కెనడా తీరును ఎండగడుతూ కేంద్ర విదేశాంగ శాఖ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఈ సందర్భంగానే కెనడా వాసులకు భారత్ వచ్చేందుకు వీసాలు నిలిపివేసిన విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

ఈ క్రమంలోనే ఖలిస్థానీ వ్యవహారంపై కెనడా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రవర్తనపై భారత్‌ మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. తీవ్రవాదులు, అతివాదులకు కెనడా అడ్డాగా మారిందని ఘాటుగా స్పందించింది. భారత్, కెనడాల మధ్య దౌత్యపరంగా టెన్షన్ వాతావరణం నెలకొన్న కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్‌ బాగ్చి మాట్డుతూ ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్ హత్య వెనుక భారత్‌ హస్తం ఉండొచ్చని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు.

 
అవన్నీ రాజకీయంగా లబ్దిపొందేందుకే మాట్లాడినట్లు ఆరోపించారు. భారత్‌పై కెనడా చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమేనన్న అరిందమ్ బాగ్చీ.. హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు సంబంధించి కెనడా ఎలాంటి సమాచారం భారత్‌కు అందించలేదని తెలిపారు.  కానీ కెనడాలో భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నేరపూరిత కార్యకలాపాలు, వ్యతిరేక శక్తులకు సంబంధించి అన్ని ఆధారాలను ఆ దేశానికి ఇచ్చినా స్పందించలేదని మండిపడ్డారు.
 
 20 నుంచి 25 మంది ఖలిస్థానీ ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలని గత కొన్నేళ్లుగా కెనడాకు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఆ దేశం పట్టించుకోలేదని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పినా వినలేదని పేర్కొన్నారు. వ్యవస్థీకృత నేరాలకు కెనడా అడ్డాగా మారుతోందని, తీవ్రవాదులు, అతివాదులకు స్వర్గధామంగా మారుతోందని మండిపడ్డారు. ప్రపంచ దేశాల ముందు పరువు పోతున్న విషయాన్ని కెనడా గుర్తించాలని అరిందమ్ బాగ్చి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఇక కెనడియన్లకు వీసాలు నిలిపివేయడంపై స్పందించిన అరిందమ్ బాగ్చి కెనడాలోని భారత హై కమిషన్లు, కాన్సులేట్లకు బెదిరింపులు పెరుగుతున్నాయని తెలిపారు. దీంతో అక్కడి పనులకు ఆటంకం కలుగుతోందని,  భద్రతాపరంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న కారణంగానే కెనడియన్ల వీసా దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేసినట్లు చెప్పారు. 

 
కేవలం కెనడా నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కెనడియన్లు దరఖాస్తులు చేసుకున్నా వారికి వీసాలు ఇవ్వలేమని స్పష్టం చేశారు. కెనడియన్లను భారత్‌కు రాకుండా ఆపాలి అనేది తమ విధానం కాదని, ఈ వీసాల నిలిపివేతకు ముందు ఇచ్చిన వీసాలతో ఎప్పుడైనా వారు భారత్‌కు రావచ్చని స్పష్టం చేశారు. 
 
భారత్‌లో కెనడా దౌత్యవేత్తలు ఎక్కువగా ఉన్నారని అరిందమ్ బాగ్చి తెలిపారు. ఇరు దేశాల్లో దౌత్యవేత్తలు సమానంగా ఉండాలని పేర్కొంటూ  కెనడాలో భారత దౌత్య వేత్తలతో పోల్చితే భారత్‌లో కెనడా దౌత్యవేత్తల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. భారత దేశ అంతర్గత విషయాల్లో కూడా కెనడా దౌత్యవేత్తలు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు.