ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు దాయాది పాకిస్థాన్ చేస్తున్న కుట్రలను ఐక్యరాజ్యసమితిలో కశ్మీరీ సామాజిక కార్యకర్త బట్టబయలు చేశారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యుఎన్హెచ్ఆర్సీ)లో శ్రీనగర్ కేంద్రంగా పనిచేస్తున్న కశ్మీరీ సామాజిక కార్యకర్త తస్లీమా అక్తర్ మాట్లాడుతూ పొరుగు దేశం పెంచిపోషిస్తోన్న ఉగ్రవాదులు కశ్మీర్లో ఏ విధంగా మారణకాండకు పాల్పడుతున్నారో కళ్లకు కట్టిన్నట్లు వివరించారు.
ఇవి చాలా వరకు బయటి ప్రపంచానికి తెలియని కథలని పేర్కొంటూ పాక్ సహకారంతో ఉగ్రదాడుల కారణంగా చాలా మంది మహిళలు బిడ్డలు, భర్తలను కోల్పోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా చిన్నతనం నుంచి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగా అమాయకుల హత్యలను నేను చూశాను.. మహిళలు, పిల్లల భరించలేని బాధలు.. ఈ ఉగ్రవాదుల చేతుల్లో బలైన బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా కృషి చేయడానికి నన్ను నడిపించాయి’ అంటూ ఆమె పేర్కొన్నారు.
ఉగ్రవాద ఊచకోతలకు బలైన కన్నీటి గాధలతో ఇక్కడ వచ్చానని చెబుతూ తాను ఉగ్రవాదం బాధితుల పిల్లలను అనేకమందిని కలుసుకొని, వారి గాధలను తెలుసుకున్నారని ఆమె చెప్పారు. తమకు సహకరించడానికి నిరాకరించిన అమాయకులు అనేకమందిని పాక్ ఉగ్రవాదులు హతమార్చారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. వారిలో చాలా మంది కుటుంబానికి ఏకైక జీవనాధారంగా ఉన్నారని, కశ్మీర్లో కుటుంబాల మనుగడ కష్టమైందని ఆమె వాపోయారు.
‘తీవ్రవాద బాధిత కుటుంబాల దయనీయమైన, భావోద్వేగ కథలు ఉన్నాయి. ఈ శూన్యాన్ని రాబోయే అనేక తరాల వరకు పూరించలేం. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం వల్ల స్వాతంత్ర్య సమరయోధులు, కశ్మీర్ ప్రజలు ఎలాంటి బాధలు పడ్డారో ప్రపంచం తెలుసుకోవాలి’ అని ఆమె స్పష్టం చేశారు. కశ్మీర్ ప్రజలు సంతోషంగా జీవించేలా ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మానవహక్కుల కౌన్సిల్కు ఆమె విజ్ఞప్తి చేశారు.
కాగా, దాయాది ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా దిగజారిపోయినా కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని పోషించేందుకు సహాకారం మాత్రం ఆపలేదు. అంతేకాదు, పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే తూట్లు పొడుస్తూ నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాటుకు సహకరిస్తూనే ఉంది.
More Stories
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్
భారత్ కు బంగ్లాదేశ్ లో టి20 మహిళా క్రికెట్ సిరీస్
ఇజ్రాయిల్తో వాణిజ్యాన్ని నిలిపివేస్తున్న టర్కీ