కాంగ్రెస్ 6 గ్యారంటీలు తెలంగాణ ప్రజలను మోసం చేయటమే

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా ఇతర నాయకులు తెలంగాణకు 6 గ్యారెంటీలు అంటూ ప్రకటించడం తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడంలో భాగమేనంటూ బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. అలవికాని హామీలతో మోసం చేసి అధికారం దక్కించుకోవాలనే కుట్ర చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.
 
నూతన పార్లమెంటు భవనంలో మహిళా బిల్లు ప్రవేశ పెట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి రాష్త్ర బీజేపీ కార్యాలయంలో అరుణ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ  కర్ణాటకలో రూ. 4 వేల పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదు? మీరు ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదు? అంటూ ఆమె కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. 
 
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, చత్తీస్ గఢ్ లాంటి రాష్ట్రాల్లో ఇటువంటి హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? అంటూ ఆమె నిలదీశారు.  గాంధీ గారి పేరు పెట్టుకుని ఇన్నాళ్లు దేశాన్ని ఏలినా పేదరికాన్ని నిర్మూలించలేదంటూ కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు.  కాంగ్రెస్ దేశవ్యాప్తంగా విశ్వాసం కోల్పోయిందని, అందుకే, మత చిచ్చు రేపి రాజకీయాలకు వాడుకుంటోందని మాజీ మంత్రి అరుణ విమర్శించారు. 
 

తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని ఆమె హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు భవిష్యత్తు గురించి మీరు ఆలోచిస్తున్నారా? అంటూ తెలంగాణలో ఆర్టీసీని ఏ స్థాయికి తీసుకు వచ్చారో కర్ణాటక లో ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడిందని ఆమె విమర్శించారు. కర్ణాటక లో ఆర్టీసీ ని ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎంత దూరమైన ఉచిత ప్రయాణమని చెప్పి ఇప్పుడు 30 కి.మీ అంటూ కుదించారని అరుణ గుర్తు చేశారు.

ముందుగా కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు మూడు గ్యారెంటీలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. 1. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ మారరని, 2. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే స్కాములుండవని, 3. తెలంగాణ చరిత్రను తప్పుదారి పట్టియ్యమని గ్యారెంటీలు ఇచ్చిన తర్వాతే వారు మాట్లాడాలని ఆమె స్పష్టం చేశారు.

గ్రామాలు, రాష్ట్రాల అభివృద్ధే ధ్యేయంగా నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని, అయితే,  తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం అణచివేసిందని, ప్రజలను మోసం చేసిందని ఆమె ధ్వజమెత్తారు. పార్లమెంటులో నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తే కవిత తన లేఖతోనే బిల్లు పెట్టారని, తమ చొరవేనంటూ నాటకాలు ఆడుతోందని అంటూ అరుణ ఎద్దేవా చేశారు.

కవిత! తెలంగాణలో మహిళలకు సరైన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వమని మొదలు మీ నాన్న కేసీఆర్ కి చెప్పు అంటూ బిజెపి నేత హితవు చెప్పారు.  బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల్లో మహిళలకు కానీసం 15 శాతం కూడా రిజర్వేషన్ అమలు చేయలేదే? అంటూ ప్రశ్నించారు.  పార్టీ లో ఒక్క మహిళ కు అయినా అత్యున్నత పదవి ఇచ్చారా? అని నిలదీశారు.