కాంగ్రెస్‌ విజయభేరీకి కేసీఆర్‌ స్పాన్సర్‌

తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయభేరీ సభకు కేసీఆర్ స్పాన్సర్ చేశారంటూ కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి  ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత పెంచేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
రాష్ట్రంలో బీజేపీని అణచివేసేందుకు కాంగ్రెస్, బిఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని, రెండు పార్టీలకు ఎంఐఎం మధ్యవర్తిత్వం వహిస్తుందని ఆరోపించారు.  క్షేత్ర స్థాయిలో అంతమంది జనాన్ని సమీకరించే సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి లేదని విమర్శించారు. బీజేపీ బలపడకుండా కుట్రలు చేస్తున్నా, బీజేపీ ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణ ఆవిర్భావం సరిగా జరగలేదంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ స్పందిస్తూ “ మోడీ తెలంగాణ విరోధి “ అంటూ చేసిన వ్యాఖ్యల పట్ల కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసిఆర్ కుటుంబానికి తెలంగాణ విమోచనా దినానికి సమైక్యతా దినానికి తేడా కూడా తెలియదని ధ్వజమెత్తారు.

ప్రధాని పార్లమెంట్‌లో ఎవ్వరినీ విమర్శించలేదని, ఎవ్వరినీ అవమానించలేదని, కేవలం పార్లమెంట్ లో నిలిచిన అంశాలపైన మాత్రమే చర్చలు జరిపారని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. విభజన సమయంలో మాదిరిగా పార్లమెంట్ లో ఎప్పుడూ  కారం, పెప్పర్ స్ప్రే వంటివి వాడదలేదని ఆయన గుర్తు చేశారు.

టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని అధికారాన్ని పంచుకుని, తెలంగాణ ఇవ్వకుండా ఆలస్యం చేసింది కాంగ్రెస్ పార్టీ అని కిషన్‌ రెడ్డి ఆరోపించారు. 4 కోట్ల మంది ప్రజలకు నిరంతర పోరాటం తర్వాత, అనేక ఉద్యమాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టిందని తెలిపారు.

42 రోజుల పాటు తెలంగాణలో సకల జనుల సమ్మె చేస్తే కానీ స్పందించని పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. హామీ ఇచ్చాం.. తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ అంటోందని, అయితే, తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసి మీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలతో తెలంగాణ  రాలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 

1952 నుంచి కూడా అనేక రకాలుగా హామీలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. 1971లో గరీబీ హటావో, 16 పాయింట్ పార్ములా.. ఏ ఒక్కదాన్నీ అమలు చేయలేదని విమర్శించారు. హైదరాబాద్ లో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్  ఇచ్చిన హామీలు మోసపూరితమైనవని దుయ్యబట్టారు. గతంలో ఇచ్చిన హామీలను అమలుచేయలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు.

 కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు ఎన్నో జరిగాయని, దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే వారికి తెలుసని విమర్శించారు. ఈ హామీలల్లో పూర్తిగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం తప్ప.. ఇవేవీ అమలు చేయలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీదని ధ్వజమెత్తారు.  అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా చాలా హామీలు ఇచ్చింది వేటినీ అమలు చేయడం లేదుని చెప్పారు.

తెలుగు ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించే పరిస్థితి లేదని, తెలంగాణ విమోచన దినోత్సవం రోజు హైదరాబాద్ లో సమావేశం పెట్టుకుని కనీసం తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.