కొత్తగా 23 సైనిక స్కూళ్లను ఏర్పాటు

భాగస్వామ్య పద్ధతిలో కొత్తగా 23 సైనిక స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త స్కూళ్లు సంబంధిత ఎడ్యుకేషన్ బోర్డుల అఫ్లియేషన్‌తో సైనిక్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తాయి.

ఆరవ తరగతి నుంచి ఎన్జీవోలు, ప్రైవేటు స్కూళ్లు, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో క్రమపద్ధతిలో 100 సైనిక స్కూళ్లకు ఆమోదం తొలిపేందుకు ప్రభుత్వ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 19 కొత్త సైనిక స్కూళ్లతో సైనిక స్కూల్ సొసైటీ అవగాహన కుదుర్చుకుంది.

కొత్త సైనిక స్కూళ్ల కోసం వచ్చిన అప్లికేషన్లను పరిగణనలోకి తీసుకుని భాగస్వామ్య పద్ధతిలో 23 కొత్త స్కూళ్ల ఏర్పాటుకు రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపినట్టు రక్షణ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. దీంతో సైనిక స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో భాగస్వామ్య పద్ధతిలో ఏర్పాటు చేస్తున్న సైనిక స్కూళ్ల సంఖ్య 42కు చేరనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33 సైనిక స్కూళ్లు నడుస్తున్నాయి.

జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా నాణ్యతాయుతమైన విద్యను అదించడం, మెరుగైన కెరీర్ అవకాశాలు కల్పించడం, సాయుధ బలగాల్లో చోటు కల్పించడం సైనిక స్కూళ్ల లక్ష్యంగా ఉండగా, ఇందుకోసం 100 కొత్త సైనిక స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్నారు.  ప్రభుత్వ, ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో ఇవాల్టి పౌరులను రేపటి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ఆలోచనగా ఉందని రక్షణ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది.