రూ.13 వేల కోట్లతో ‘పీఎం విశ్వకర్మ’ పథకం

సంప్రదాయ వృత్తులను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన “పీఎం విశ్వకర్మ” పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  దివారంనాడు ‘విశ్వకర్మ జయంతి’  సందర్భంగా ప్రారంభించారు. ప్రధాని తన 73వ జన్మదినోత్సవమైన ఆదివారంనాడు ఈ పథకాన్ని ప్రారంభించడం విశేషం.  కొత్తగా ప్రారంభించిన అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ‘యశోభూమి’లో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ప్రసంగించిన ప్రధాని అట్టడుగు వర్గాల ప్రజల కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
ఈ పథకం కోసం రూ.13 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుందని వెల్లడించారు. ‘పీఎం విశ్వకర్మ యోజన’ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.13వేల కోట్లను ఖర్చుచేయనుంది. దీని ద్వారా లక్షల మంది చేతివృత్తుల కళాకారులకు లబ్ధి చేకూరనుంది’ అని వెల్లడించారు.

“జీ20 అతిథులకు విశ్వకర్మ కళాకారులు తయారు చేసిన ఆకృతులను అందజేశాం.స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కొత్తగా అందుబాటు లోకి వచ్చిన ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (ఐఐసిసి) కీలక పాత్ర పోషిస్తుంది. దీని ద్వారా లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి” అని ప్రధాని వివరించారు.

సమావేశాల టూరిజం విలువ రూ.25 లక్షల కోట్లుగా ఉందని చెబుతూ భారత్‌కు ఎన్నో అవకాశాలున్నాయని, కళాకారులు, చేతివృత్తుల వారు జీఎస్టీ నమోదిత దుకాణాల నుంచే టూల్‌కిట్లను కొనుగోలు చేయాలని ప్రధాని స్పష్టం చేశారు. వినాయక చవితి, దీపావళి, ధంతేరాస్ వంటి పండగల వేళ స్థానిక ఉత్పత్తులనే కొనాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. 

విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17న ప్రారంభించిన ఈ విశ్వకర్మ పథకం ద్వారా ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన 18 వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది. ఐదేళ్ల కాలంలో రూ.13 వేల కోట్లను అందించనుంది. వడ్డీ రాయితీతో రుణాలను మంజూరు చేయనున్న ఈ పథకం ద్వారా దాదాపు 30 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

కళాకారులు తమ నైపుణ్యాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవడం , టూల్‌కిట్ ఇన్సెంటివ్, డిజిటల్ లావాదేవీలు, మార్కెటింగ్‌ను ప్రోత్సహించేందుకు వీలుగా ఈ రుణాలు మంజూరు చేస్తారు. తొలి విడతలో రుణ సాయం 5 శాతం రాయితీ వడ్డీతో రూ. లక్ష (18 నెలల రీపేమెంట్) మంజూరు చేస్తారు. ఆ తర్వాత రెండో విడతలో రూ. 2 లక్షల రుణం (30 నెలల రీపేమెంట్ ) ఇస్తారు. 

వడ్రంగులు, పడవలు తయారు చేసేవారు, ఆయుధాలు తయారు చేసేవారు, కమ్మరి, ఇనుప పరికరాలు తయారు చేసేవారు, ఇంటి తాళాలు తయారీదారులు, స్వర్ణకారులు, కుమ్మరి (కుండలు తయారుచేసే వారు), విగ్రహాల తయారీదారులు (మూర్తికార్,స్టోన్ కర్వర్, స్టోన్ బ్రేకర్), చర్మకారులు (చెప్పులు తయారు చేసేవారు), తాపీ పనిచేసేవారు (రాజ్ మిస్త్రీ), బాస్కెట్/మ్యాట్/బ్రూమ్ మేకర్/నారతాళ్లు చేసేవారు, సంప్రదాయ బొమ్మలు తయారు చేసేవారు, క్షురకులు, పూలదండలు తయారు చేసేవారు, రజకులు,దర్జీలు,చేపవలల తయారీ దారులు ఇందుకు అర్హులు. 

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ  ఎర్రకోట నుంచి ఈ పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద బయో మెట్రిక్ ఆధారిత పీఎం విశ్వకర్మ పోర్టల్‌ను ఉపయోగించుకుని కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా లబ్ధిదారులు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

పీఎం విశ్వకర్మ పథకం ద్వారా లబ్ధిదారులకు పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్, ఐడీ కార్డు ఇస్తారు. నైపుణ్యతలను పెంచేందుకు బేసిక్, అడ్వాన్స్‌డ్ శిక్షణ కల్పిస్తారు. రూ.15,000 విలువైన టూల్‌కిట్ ఇన్సెన్టివ్, డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తారు. దేశీయ మార్కెట్‌తో పాటు, గ్లోబల్ వాల్యూ పెరిగేలా కళలు, కళాకారులను ప్రోత్సహిస్తారు.