
భారత వైమానిక దళానికి అధునాతన సాంకేతికతలతో కూడిన మరో విమానం జత అయింది. ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ వైమానిక దళానికి 56 సి-295 రవాణా విమానాలలో మొదటి దాన్ని అందించింది. రూ.21 వేల 935 కోట్ల ప్రాజెక్టు డీల్ లో భాగంగా దీనిని ఎయిర్ ఫోర్స్ కి అందించినట్లు అధికారులు తెలిపారు.
ఎయిర్ స్టాఫ్ చీఫ్ మార్షల్ వి ఆర్ చౌదరి దక్షిణ స్పానిష్ నగరం సెవిల్లెలోని ఏరోస్పేస్ మేజర్స్ ప్రొడక్షన్ ఫెసిలిటీ వద్ద విమానాన్ని అందుకున్నారు. ప్రభుత్వం, కాంట్రాక్టర్ల ఒప్పందం ప్రకారం, ఎయిర్బస్ 2025 నాటికి 16 విమానాలను డెలివరీ చేస్తుంది. మిగతా 40 విమానాలను టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తయారు చేసి అసెంబుల్ చేస్తుంది.
గతేడాది అక్టోబర్లో వడోదరలో సి 295 విమానాల తయారీ కేంద్రానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. భారత వైమానిక దళం ఆరు దశాబ్దాల నుంచి పని చేస్తున్న అవ్రో-748 విమానాల స్థానంలో సి 295 విమానాలను కొనుగోలు చేస్తోంది. సి 295 ఎరోప్లేన్ 71 మంది సైనికులు లేదా 50 మంది పారాట్రూపర్ల రవాణా కోసం, భారీ విమానాలు వెళ్లలేని ప్రదేశంలో లాజిస్టిక్ కార్యకలాపాల కోసం ఉపయోగపడనుంది.
ఎయిర్క్రాఫ్ట్ పారాట్రూప్స్, లోడ్లను ఎయిర్డ్రాప్ చేయగలదు. ప్రాణనష్టం జరగకుండా హాస్పిటల్ కి తరలించడం, సముద్రంలో గస్తీ కాయడం తదితర పనులు చేయగలదు. మరో విమానాన్ని 2024 మే నెలలో అందించనున్నట్లు తెలుస్తోంది. ఐఎఎఫ్ నుండి ఆరుగురు పైలట్లు, 20 మంది సాంకేతిక నిపుణులు ఇప్పటికే సెవిల్లె ఫెసిలిటీలో శిక్షణ పొందారు. వడోదరలో సి 295 ఎయిర్క్రాఫ్ట్ చివరి అసెంబ్లింగ్ లైన్ వచ్చే ఏడాది నవంబర్లో అందుబాటులోకి రానుంది.
More Stories
భారత్ లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం
కేంద్రం రుణాల్లో 99 శాతం మూలధన వ్యయాల కోసమే
కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. రూ 10 లక్షల కోట్లు ఆవిరి